సీఎం సువేందు అధికారి (Suvendu Adhikari) నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. నేడు జరిగిన తొలి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మత ఆధారిత ప్రభుత్వ సహాయ పథకాలను జూన్ నుంచి నిలిపివేయాలని నిర్ణయించింది. అలాగే కలకత్తా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రస్తుత ఇతర వెనుకబడిన వర్గాల (OBC) జాబితాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
మంత్రి అగ్ని మిత్ర పాల్ ( Agnimitra Paul) మాట్లాడుతూ, కొత్తగా ఒక కమిటీ ఏర్పాటు చేసి కోటా అర్హతలను పరిశీలిస్తామని తెలిపారు. సమాచార, సాంస్కృతిక శాఖలు అలాగే మైనారిటీ వ్యవహారాలు, మదర్సా విద్యాశాఖల ద్వారా మత ఆధారంగా అమలు చేస్తున్న పథకాలు ఈ నెలాఖరు వరకు మాత్రమే కొనసాగుతాయని, జూన్ నుంచి పూర్తిగా నిలిపివేస్తామని వెల్లడించారు.
గతంలో మమతా బెనర్జీ( Mamata Banerjee) ప్రభుత్వం 2012లో ఇమామ్లకు నెలకు రూ.2,500 గౌరవ వేతనం ప్రకటించింది. అనంతరం మసీదుల్లో ప్రార్థనలకు పిలుపునిచ్చే ముయజ్జిన్లకు కూడా ఆర్థిక సహాయం అందించింది. ఈ నిధులను మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా పంపిణీ చేసేవారు.
2020లో హిందూ పూజారులైన పురోహితులకు కూడా నెలవారీ గౌరవ వేతనం ప్రకటించారు. ప్రారంభంలో రూ.1,000గా ఉన్న ఈ భృతి, 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రూ.2,000కు పెంచారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం సంక్షేమ పథకాలు మతపరమైన గుర్తింపుల ఆధారంగా ఉండకూడదనే విధానాన్ని అనుసరిస్తోంది.
ఇక మహిళలపై జరిగిన దాడులు, అక్రమాలపై కూడా ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. మాజీ న్యాయమూర్తి బిశ్వజిత్ దాస్( Biswajit Das) పర్యవేక్షణలో అవినీతి, నిధుల పంపిణీ అక్రమాలపై విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది.
అలాగే మహిళలపై జరిగిన దారుణాల కేసులను విచారించేందుకు రిటైర్డ్ జస్టిస్ సమాప్తి చటర్జీ( Samapti Chatterjee )ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. మాజీ ఐపీఎస్ అధికారి దమయంతి సేన్( Damyanti Sen) ఈ కమిటీలో సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు.
ఒక నెలలోపు నివేదిక అందించాలని ప్రభుత్వం కమిటీకి ఆదేశాలు జారీ చేసింది.


