స్వతంత్ర వెబ్ డెస్క్: నిజామాబాద్లో రూ.50 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ బుధవారం ప్రారంభంకానున్నది. బీఆర్ఎస్ (BRS)వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక, పరిశ్రమలశాఖ మంత్రి కే తారాకరామారావు (KTR) దీనిని ప్రారంభించనున్నారు. దీనితో పాటు న్యాక్, మున్సిపల్ కార్పొరేషన్ భవనాలను, అధునాతన వైకుంఠధామాన్ని, రఘునాథ చెరువు ట్యాంక్బండ్ను మంత్రి ప్రారంభించనున్నారు. కేటీఆర్ రాక సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మంత్రి కేటీఆర్ ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11.15 గంటలకు నిజామాబాద్లోని (NIZAMABAD) ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లో ఆవరణలోని హెలిప్యాడ్లో దిగుతారు.
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్కు (HYDERABAD) తిరుగు పయనమవుతారు. కేటీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. సభా ఏర్పాట్లను మంగళవారం ఎమ్మెల్యేలు బిగాల గణేశ్గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు పరిశీలించారు. నిజామాబాద్లోని ఈ ఐటీ టవర్ను మొత్తం 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆకట్టుకునే రీతిలో నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్తో కలుపుకొని మూడు అంతస్థులతో ఈ నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఎకరం భూమిలో ఐటీ టవర్ను (IT TOWER) డిజైన్చేశారు. మిగిలిన 2.5 ఎకరాల భూమిని భవిష్యత్తులో ఐటీ టవర్ను విస్తరణకు ఉపయోగించనున్నారు.