స్వతంత్ర వెబ్ డెస్క్: ఆర్టీసి ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajender) పేర్కొన్నారు. గవర్నర్ అందుబాటులో లేరని చెబుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం హడావుడి చేస్తోందన్నారు. ఆర్టీసి కార్మికులు ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదని ఈటల పేర్కొన్నారు. గెస్ట్ లెక్చరర్స్, సెకండ్ ఏఎన్ఎంలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, మహిళా సంఘాలు ఇలా మంది తమ సమస్యలు చెప్పుకుందామంటే ఎవరు పట్టించుకోవడం లేదు. మంత్రులు, అధికారులు భరోసా ఇవ్వడం లేదు. సీఎం కేసీఆర్(CM KCR) ఎవరికి అందుబాటులో ఉండరు. సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ నిర్వహించాలి. అయినా మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకరోజు హరీష్ రావు, ఒకరోజు కేటీఆర్ దాడి చేశారు. రేపు సీఎం కేసీఆర్ దాడి చేస్తారు’ అని అన్నారు.
‘ఆర్టీసీలో సంస్థకు సంబంధించి 6 వేల బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఆర్టీసీ కార్మికులకు రెండు పీఆర్సీలు బకాయి పడ్డారు. ఆర్టీసీలో(RTC) పనిచేసే ఇతర సిబ్బందిని పర్మినెంట్ చేయాలి. గవర్నర్ తమిళిసై(TAMILSAI)కి ఆర్టీసీ బిల్లు మొన్ననే పంపారు. బిల్లు చూడాలి, చదవాలి, సంతకం చేయాలి. ఇదంతా వదిలేసి అందుబాటులో లేరని చెబుతున్నారు. ఈ విషయంలో బట్టకాల్చి మీదేసినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఆర్టీసీ కార్మికులను బలవంతంగా గవర్నర్ కార్యాలయం ముందు ధర్నాకు తీసుకువస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు. వచ్చే ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయి’ అని ఈటల పేర్కొన్నారు.