స్వతంత్ర వెబ్ డెస్క్: గిరిజనుల (Tribals) హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం కేంద్ర అటవీ చట్టం (Forest act) తీసుకొచ్చిందని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. మణిపూర్లో (Manipur) ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమం, పోడు భూముల పట్టాల పంపిణీపై శాసన మండలిలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సి కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లు ఆరు నుంచి 9 శాతానికి పెంచుకున్నామన్నారు. గిరిజనులకు 4 లక్షల 5 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చామని వెల్లడించారు.
దీనిద్వారా 1 లక్షా 57 మంది గిరిజన కుటుంబాలకు పోడు భూములపై హక్కులు లభించాయని చెప్పారు. కల్యాణలక్షి, కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి పథకాలతో గిరిజన ఆడబిడ్డలకు ప్రయోజనం కలుగుతున్నదని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు వేలకుపైగా ఎస్టీ విద్యార్థ/కు జాతీయ స్థాయి అత్యున్నత విద్యాసంస్థల్లో సీట్లు వచ్చాయని చెప్పారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం అని, జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.340 కోట్లు ఖర్చుచేసిందన్నారు. గోండు, బంజారా లాంటి గిరిజనుల కళలను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. గోండు భాషలో ప్రాథమిక విద్య పుస్తకాలు రూపొందించామన్నారు.