ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో స్పీడు పెంచారు. ఈ నెల 20 నుంచి పవన్ వరుసగా పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో కనీసం రోజుకి 2 సభల్లో పాల్గొని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇవాళ తాడేపల్లిగూడెం, ఉంగు టూరులో పవన్ కళ్యాణ్ రోడ్ షోలు, బహిరంగ సభలలో పాల్గొననున్నారు. సాయంత్రం తాడేపల్లి గూడెం లోని జీవి మాల్ సెంటర్లో బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు. ఈ సభలకు భారీగా జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు హాజరుకానున్నారు.
మరోవైపు రేపు పిఠాపురం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. పిఠాపురం అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్కు పవన్ స్వయంగా నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. అదే రోజు సాయంత్రం ఉప్పాడలో పవన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రేపు ఉదయం గొల్లప్రోలు మండలం చేబ్రోలు నుంచి పవన్ బయలుదేరి గొల్లప్రోలు, పిఠాపురం పట్టణాల మీదుగా ప్రదర్శనగా పాదగయక్షేత్రం వద్దకు చేరుకుంటారన్నారు. అక్కడినుంచి కాలినడకన పిఠాపురం మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి ఆర్వోకు నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు. ఇక ఈనెల 24న చంద్రబాబుతో కలిసి రాజంపేట, రైల్వే కోడూరు బహిరంగ సభలకు పవన్ హాజరు కానున్నారు.
ఇప్పటికే వారాహి విజయయాత్ర విజయవంతంగా సాగుతోంది. నిన్న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, భీమవరం, సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈసభలకు జనసైనికులు, టీడీపీ కార్య కర్తలు భారీగా తరలివచ్చారు. అయితే కూటమికి మద్దతు ప్రకటించిన చిరంజీవిపై సజ్జల చేసిన వ్యాఖ్యలపై పవన్ సీరియస్ అయ్యారు. చిరంజీవి అజాత శత్రువు.. ఆయన జోలికొస్తే సహించేది లేదంటూ సజ్జల రామకృష్ణారెడ్డిని హెచ్చరించారు. రాష్ట్రప్రజల జోలికి, చిరంజీవి జోలికి, బడుగుబలహీన వర్గాల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాలంటూ పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ సింహం కాదు.. గుంటనక్కలు, తోడేళ్ల బ్యాచ్ అని విమర్శించారు. సజ్జలకు డబ్బు, అధికారం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.