దేశం అంతా ఒకతీరు.. కేరళది మాత్రం ప్రత్యేకతీరు. దాదాపు పూర్తి అక్షరాస్యత సాధించిన కేరళలో రాజకీయ చైతన్యం ఎక్కువే. కేరళలో పార్లమెంటు ఎన్నికలన్నా.. అసెంబ్లీ ఎన్నికలు అన్నా ..ఎల్ డీఎఫ్, యూడీఎఫ్ మధ్య పోరే.. మరో పార్టీకి అవకాశం దాదాపు లేనట్లే. దశాబ్దాలుగా 2021 తప్ప… ఒక టర్మ్ ఎల్ డీఎఫ్ గెలిస్తే.. మరో టర్మ్ యూడీఎఫ్ గెలు స్తూ వచ్చాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా అలయన్స్ లో సీపీఐ, సీపీఎం ఉన్నా.. కేరళలో మాత్రం..యూడీఎఫ్, ఎల్ డిఎఫ్ పరస్పరం కత్తులు దూస్తున్నాయి. కనీసం ఈ సారైనా.. ఒక్క సీటు సాధించి బోణీ కొట్టాలని మోదీ ఆధ్వర్యం లోని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.
కేరళలో రాజకీయ పరిస్థితి చిత్రమైంది. 2024 పార్లమెంటు ఎన్నికలకు చాలా కాలం ముందునుంచే ఓటర్ల మనో భావాలను ప్రభావితం చేసే పౌరసత్వ సవరణ చట్టం, ఎలక్టోరల్ బాండ్లతో సహా చాలా అంశాలపై రాజకీయ రంగంలో చర్చలు హోరెత్తుతున్నాయి. రాజకీయ చైతన్యం కలిగిన మేధావి వర్గం కీలక అంశాలపై స్పందించడం కేరళ ప్రత్యేకం. ధరల పెరుగుదల, నిరుద్యోగం, అవినీతి, బీజేపీ పదేళ్ల పాలనలో అనుసరించిన విధానాలపై చర్చలు సాగుతున్నాయి. కేరళలో సంప్రదాయంగా వామపక్షాలు, కాంగ్రెస్ ల ఆధిపత్యం ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తనదైన ముద్ర వేసేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
దక్షిణాది రాష్ట్రమైన కేరళలో బీజేపీ ఖాతా తెరవాలని గట్టిగా కోరుతున్న ప్రధాని మోదీ.. ఈ ఏడాది ప్రారంభం నుంచీ ఐదుసార్లు పర్యటించారు. పోలింగ్ తేదీలోగా మళ్లీ పర్యటించే అవకాశం ఉంది. కరడు గట్టిన హిందుత్వవాది అయిన మోదీ క్రిస్టియన్లను ఆకట్టుకునేందుకు ఏప్రిల్ 9న ఈస్టర్ సండే నాడు ఢిల్లీలోని స్కేర్డ్ హార్ట్ కెథడ్రాల్ సందర్శించారు. కేరళలో పదేపదే పర్యటిస్తూ..రబ్బర్ తోటల్లో పనిచేసే కూలీల్లో క్రిస్టియన్లను ఆకట్టుకునేందుకు యత్నించారు. ఏప్రిల్ 24న రోడ్ షో కు సిద్ధమవుతున్నారు. కేరళ జనాభాలో 26.5 శాతం ఉన్న ముస్లింలు, 18.4 శాతంగా ఉన్న క్రిస్టియన్లను ఆకట్టుకునేందుకు తనదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు కానీ, రెండు వర్గాలు అటు ఎల్టీఎఫ్ కో ఇటు యూడి ఎఫ్ కో ఓట్లు వేసే వారే తప్ప బీజేపీ వైపు చూసే దాఖలాలు కన్పించడం లేదు.
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నా… కేరళలోని 20 నియోజ కవర్గాలకు ఒకే దశలో ఏప్రిల్ 26న ఎన్నిక జరుగుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు , ఫలితాలు. 2019 ఎన్నికల్లో కేరళ లోని 20 సీట్లలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 19 సీట్లు గెలుచుకుంది. 2009 లోక్ సభ ఎన్నికల్లో వామపక్షాల నేతృత్వంలోని ఎల్ డిఎఫ్, 4, కాంగ్రెస్ 13, ఇండియన్ యూనియన్ ముస్లీంలీగ్ 2, కేరళ కాంగ్రెస్ -ఎం ఒకస్థానాన్ని గెలుచుకున్నాయి. 2014లో ఎల్ డీఎఫ్ 6, కాంగ్రెస్ 8, ఐయు ఎంఎల్ 2, కేరళ కాంగ్రెస్ -ఎం 1, ఆర్ ఎస్పీ 1, రెండుస్థానాల్లో ఇండిపెం డెంట్లు నెగ్గారు. ఈ మూడు ఎన్నికలలోనూ బీజేపీ ఒక సీటు కూడా గెలవలేదు.
ఎల్ డీఎఫ్, యూడీఎఫ్ లు రెండు పౌరసత్వసవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం 2019 రాజ్యాంగ విరుద్ధమని ఈ పార్టీలు ఆరోపిస్తున్నాయి. సీఏఏ కేరళలో హాట్ పొలిటికల్ ఇష్యూగా మారింది. 2019 డిసెంబర్ 19న లోక్ సభ లో ప్రవేశపెట్టిన తర్వాత బిల్లుపై చర్చ సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలువురు ఎంపీలు చర్చలో పాల్గొని బిల్లును వ్యతిరేకించారు. సీఏఏ ముస్లింల పట్ల వివక్షతో కూడుకున్నదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ గతంలోనే గళమెత్తారు. ఏప్రిల్ 5న విడుదల చేసిన లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోలో సీఏఏను ప్రస్తావించకపోవడంపై ఆయన కాంగ్రెస్ పై మండిపడ్డారు.
ఇటీవలి కాలంలో ఏనుగులు, పులులు, అడవి పందులదాడిలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కేరళ ప్రభు త్వం మానవ – జంతు సంఘర్షణను నిర్దిష్ట విపత్తుగా ప్రకటించింది. ఇలా ప్రకటించిన తొలిరాష్ట్రం కేరళనే. కాగా 1972 నాటి వన్యప్రాణి చట్టానికి సవరణలు చేయాలని ఎల్డీఎఫ్, యూడీఎఫ్ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. అభయా రణ్యాలను కట్టుదిట్టంగా నిర్వహించడం, జంతువులు గ్రామాల్లోకి రాకుండా కట్టుదిట్టమైన వ్యవస్థ ఏర్పాటు చేయడం, జంతువుల దాడిలో మరణించినవారి కుటుంబాలకు భారీ పరిహారం వంటి అంశాలతో వన్యప్రాణి చట్టానికి సవరణ చేయాలని కేరళలోని రెండు అధికార కూటములు కోరుతున్నాయి. ఈ అంశం ఎన్నికల్లో ప్రచారాంశం కావచ్చు.
నిరుడు మే 3న మణిపూర్ లో భారీ హింసాకాండ, గృహదహనాలు జరిగాయి. ఆనాటి నుంచి మణిపూర్ రావణకాష్టంలా రగులుతూనే ఉంది. ఎందరో క్రిస్టియన్లు ప్రాణాలు కోల్పోయారు. చాలా చర్చ్ లు ధ్వంస మయ్యాయి. ఈ పరిణామాలు కేరళ వాసులను కలచివేశాయి. ఆ రాష్ట్రంలో ప్రధాని పర్యటించక పోవ డం, బాధితవర్గాలకు ఉపశమనం కల్గించక పోవడం క్రిస్టియన్ కమ్యునిటీని ఆవేదనకు గురిచే సింది. అయినా.. క్రిస్టియన్లను ఆకట్టుకునే యత్నాలను బీజేపీ కొనసాగిస్తోంది. కనీసం కొన్ని సీట్లు గెలవ డమే లక్ష్యంగా మోదీ ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారికి పౌరసత్వం కల్పిస్తామన్న హామీని బీజేపీ నిలబెట్టుకుంటుందని చెప్పే ప్రయత్నం చేయవచ్చు.. ఈసారి అయినా కేరళ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఖాతా తెరుస్తుందేమో.. చూడాలి.


