కామారెడ్డిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
కామారెడ్డిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో జహీరాబాద్ ఎంపీ స్థానం వీవీప్యాట్లు, ఈవీఎంలు తీసుకెళ్లే సమయంలో వర్షం కురవడంతో అధికారులు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో వీవీప్యాట్లు, ఈవీఎంల తరలింపు కార్యక్రమానికి అంతరాయం ఏర్పడింది. అధికారులు సమన్వయంతో ఈవీఎంలు తరలించాలని జిల్లా కలెక్టర్ జతీష్ వి పాటిల్ ఆదేశించారు. అధికారుల బృందం దగ్గరే ఉండి మరీ కలెక్టర్ ఈవీఎంల తరలింపు ప్రక్రియను నిర్వహించారు.
మహబూబాబాద్ ఎంపీ స్థానం ఈవీఎంల పంపిణీ
వరంగల్ జిల్లాలో సోమవారం జరిగే మహబూబాబాద్ ఎంపీ స్థానం ఎన్నికల కోసం నర్సంపేట వ్యవ సాయ మార్కెట్లో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ జరిగింది. నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను అధికారులు పంపిణీ చేశారు. మార్కెట్కు చేరుకున్న పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అధికారులు అందజేశారు. ఈవీఎంలను తీసుకున్న పోలింగ్ స్టేషన్ అధికారులు పోలింగ్ స్టేషన్లకు వాటి తరలింపు చేపట్టారు.
విజయనగరం జిల్లాలో పోలింగ్కు సర్వం సిద్ధం
విజయనగరం జిల్లాలో పోలింగ్కు సర్వం సిద్ధమైంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఇందుకోసం జిల్లాలోని పోలీస్ పరెడ్ గ్రౌండ్ ఎన్నికల విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బంది కి విశాఖపట్నం రేంజ్ డీఐజీ విశాల్ గున్ని దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కనపాక, ధర్మపురి, జొన్నగుడ్డి, దుప్పాడ, ద్వారపూడి పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు.
తెలంగాణలో రేపు పోలింగ్కు సర్వం సిద్ధం
రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్ సభ, కంటోన్మెంట్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 పార్లమెంటు స్థానాలకు బరిలో 525 మంది అభ్యర్థులు నిలిచారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ పెంచేందుకు రేపు రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 35వేల 808 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మల్కాజ్ గిరిలో 3226 పోలింగ్ కేంద్రాలు 1లక్ష 9వేల 941 బ్యాలెట్ యూనిట్లు, 44వేల 906 కంట్రోల్ యూనిట్లు ఏర్పాట్లు చేశారు. కాగా… ఎన్నికల సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
హెచ్సీయూ విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడిన రేవంత్ రెడ్డి
గచ్చిబౌలి స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడారు. హెచ్సీయూ విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడారాయన. గోల్ చేసేందుకు ప్రయత్నించారు. ఆట మధ్యలో రేవంత్ షూస్ పాడైపోయాయి. దీంతో షూస్ లేకుండానే ఫుట్బాల్ ఆడారు రేవంత్ రెడ్డి.