పౌర్ణమి గరుడ సేవ….
తిరుమలలో స్వామివారి పౌర్ణమి గరుడసేవ భక్తుల గోవిందనామస్మరణల నడుమ ఘనంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి గరుడ వాహనధారుడై ఆలయ మాడవీధుల్లో విహరిం చారు. కాగా స్వామి వారి ఆలయానికి వాయువ్యదిశలో ఉన్న శ్రీకుమారధార తీర్థ ముక్కోటి కార్యక్రమంకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వర్చువల్గా శంకుస్థాపన…
అమృత్ భారత్ స్టేషన్ల పధకం కింద దేశవ్యాప్తంగా ఐదు వందలకు పైగా స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు ప్రధాని మోదీ సోమవారం వర్చువల్గా శంకుస్ధాపన చేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్లో 57 స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగనుంది. దీంతోపాటు ఆయా డివిజన్లలో నిర్మాణం పూర్తి చేసు కున్న మూడు రైల్వే ఫ్లైఓవర్లను, 29 రైల్వే అందర్పాస్లను జాతికి అంకితం చేస్తారు మోదీ.
ఎన్రోల్ అయితే చాలు…
దేవాదాయ శాఖలో అసెస్టెంట్ కమీషనర్ పోస్టుల నియామక అర్హత విషయంలో హైకోర్ట్ స్పష్టత నిచ్చింది. హైకోర్టులో మూడేళ్ళు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఉండాలన్న నిబంధనను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. న్యాయవాది అయితే చాలంటూ…సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయిన వ్యక్తి ఆయా రాష్ట్రాల హైకోర్ట్ న్యాయవాది అవుతారని స్పష్టం చేసింది.
టీటీడీకి లేఖ రాసిన మఠం
టీటీడీ అధికారులు, ఆలయంపై రమణదీక్షితులు చేసినట్లు చెపుతున్న వాఖ్యల నేపధ్యంలో ఆయనపై తిరుమల వన్టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దేవస్ధానం సైబర్ సెక్యూరిటీ విభాగం చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. అటు అహోబిల మఠం ప్రతిష్ఠను దిగజార్చేలా రమణదీక్షితులు వ్యాఖ్యలు చేసారంటూ మఠం అధికారి శనివారం టీటీడీకి లేఖ రాసారు.
పోలీసుల అత్యుత్సాహం
మేడారం జాతరలో విధులు నిర్వర్తించేందుకై వచ్చిన పోలీసుల మధ్య సమన్వయలోపంతో భక్తులు నానా అవస్ధలు పడ్డారు. బీట్ ఆఫీసర్లు సైతం అవమానాలకు గురయ్యారు. జర్నలిస్టుల విధులకు ఆటంకాలు తప్పలేదు. పోలీసుల తీరుపై భక్తులు, జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే అశేషంగా తరలి వచ్చిన భక్తుల్ని కట్టడి చేయడంలో ఇలాంటివి కామనే అంటూ కొట్టిపారేసారు పోలీసులు.
నిబంధనలు పాటించాల్సిందే..
ట్రాఫిక్ నిబంధనలను పాటించని వాహనదారులపై చర్యలు తప్పవంటూ హెచ్చరించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళి. మైనర్లకు వాహనాలు ఇస్తే పూర్తి బాధ్యత వాహన యాజమానులదే అన్నారు. హెల్మెట్ ధరించడం, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరన్న సీఐ అదనపు సైలెన్సర్ లు బిగించి శబ్దకాలుష్యం చేసే వారిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
రెచ్చిపోయిన దొంగలు
ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో దొంగలు రెచ్చిపోయారు. ప్రధాన రహదారిపై ఉన్న దుకాణాల తాళాలను పగులగొట్టారు. సీసీ కెమెరాలను తొలగించి లక్ష రూపాయల నగదును దోచుకెళ్లారు. కోట, వాకాడు, చిట్టమూరు తదితర ప్రాంతాల్లో తరచూ జరుగుతున్న ఈ చోరీలు పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నాయి.
ఇద్దరు మృతి – ఒకరికి గాయాలు
మంచిర్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చెన్నూరు మండలం కత్తెరసాల బ్రిడ్జి వద్ద ఈ ఘటన జరిగింది. అతివేగంగా వచ్చిన బోలెరో వాహనం రెండు ద్విచక్ర వాహనాల్ని ఢీ కొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడ్డ వ్యక్తిని చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్సకై తరలించారు,
గంజాయి చాక్లెట్స్
హైదరాబాద్ బాలానగర్లో గంజాయి చాక్లెట్లు బైటపడ్డాయి. ఒడిశాకు చెందిన అనంత కుమార్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న కిరాణా షాపులో ఈ గంజాయి చాక్లెట్లు లభ్యమయ్యాయి. గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నా డన్న సమాచారంలో తనిఖీలు చేపట్టిన బాలానగర్ SOT పోలీసులు మూడు ప్యాకెట్లలోని 125 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
తగ్గిన తోడేళ్ల ఊళలు
తోడేళ్లు రాత్రి సమయాల్లో వేసే ఊళలు అంటే అరుపులు తగ్గడానికి అటవీ సమీప ప్రాంతాల్లోకి నివాసిత ప్రాంతాలు విస్తరిస్తుండటమే కారణమంటూ సర్వేలు వెల్లడిస్తున్నాయి. తోడేళ్ల సముదాయంపై మహారాష్ట్ర లో చేసిన సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. రాత్రిళ్లు దీపాల వెలుగులు, వాహనాల రాకపోకలు వంటి కారణాలతో వాటి జీవనానికి భంగం ఏర్పడటం కూడా మరో కారణంగా సర్వే పేర్కొంది.
లారెన్స్ మరో నిర్ణయం
డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ తన అభిమానుల కోసం మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. తన నిర్ణయాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తనకోసం తన అభిమానులు ప్రయాణాలు చేయకూడదన్నది లారెన్స్ నిర్ణయం. అందుకే వారి పట్టణాల్లోనే ఫోటోషూట్ నేటి నుండి ప్రారంభిస్తున్నా…మొదటి స్ధానం లో విల్లుపురంలో మనమందరం కలుద్దాం అంటూ ఎక్స్లో రాసుకొచ్చాడు లారెన్స్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్లే ఆఫ్ దశకు ప్రో కబడ్డీ
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ప్రో కబడ్డీ పదో సీజన్ పోటీలు ప్లే ఆఫ్స్ దశకు చేరుకున్నాయి. సోమవారం నుండి ఆరంభం కానున్న ఈ ఫ్లే ఆఫ్స్ మ్యాచ్లో పోటీ పడేందుకు అగ్రస్థానం లో నిలిచిన ఆరు జట్లు తలపడనున్నాయి. దబాంగ్ ఢిల్లీ, పట్నా పైరేట్స్ మధ్య ఎలిమినేటర్ 1, గుజరాత్ జెయింట్స్ హర్యానా స్టీలర్స్తో మధ్య ఎలిమినేటర్ 2 పోటీలు జరగనున్నాయి.
307 పరుగులకు భారత్ ఆలౌట్
ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రాంచీ వేదికగా జరుగుతున్న నాల్గో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 353 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ 307 పరుగులకు ఆలౌటై 46 పరుగులతో వెనుకబడింది. ఇప్పటికే 2-1 ఆధిక్యంలో భారత్ ఉండగా, ఈ నాల్గొ టెస్ట్ ఇరుజట్లకు కీలకం.