ముంబయి మహానగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లు, రహదారులను చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతో ఎక్కడ చూసినా వాణిజ్య నగరంలోని రహదారులపై వరద నీరు కనిపిస్తోంది. వర్షం నీటిలో వాహనాలు మునిగిపోతున్నాయి. ముంబై మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించారు. రుతుపవనాలు విస్తరించడంతో మహారాష్ట్ర రాజధాని ముంబైలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లపై వరద నీరు కనిపిస్తోంది. రోడ్ల నుండి రైలు పట్టాల వరకు అన్ని చోట్లా నీరు నిల్వ ఉంది. దీంతో వాహనాలు గమ్యస్థానాలకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది.
పలు రైళ్లను రైల్వేశాఖ దారిమళ్లించింది. రైలు పట్టాలపై భారీగా నీరు, మట్టి చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరో రెండు రోజులపాటు ముంబై మహానగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. మహారాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండి తెలిపింది.