తెలుగుదేశం అధినేత చంద్రబాబు 94 మందితో పోటీ చేసే అభ్యర్దుల తొలి జాబితా ప్రకటించారు. అందులో 23 మంది కొత్తవారికి అవకాశం ఇచ్చారు. సామాజిక సమీకరణాల ఆధారంగా సుదీర్ఘ కసరత్తుతో ఈ లిస్టు కూర్పు చేసినట్లు చెప్పారు. మహిళలకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చారు. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అందరికీ సీట్లు ఇస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించారు. ఈ జాబితాలో సీనియర్లను కొందరిని పక్కన పెట్టారు. గంటా శ్రీనివాసరావును విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలనే ప్రతిపాదన పైన ఆయన విముఖంగా ఉన్నారు. ప్రస్తుతం గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ నార్త్ పొత్తు కుదిరితే బీజేపీ లేదా జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. దీంతో..గంటాకు సీటు ఖరారు చేయలేదని తెలుస్తోంది.
పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటు గురించి కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. రాజమండ్రి రూరల్ జనసేనకు ఖరారైనట్లు ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు జాబితాలో ఈ నియోజకవర్గంకు అభ్యర్దిని ఖరారు చేయలేదు. బుచ్చయ్య తో పాటుగా కందుల దుర్గేష్ కు సర్దుబాటు జరుగుతుందని పార్టీ నేతలు చెబుతు న్నారు. రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవానీ స్థానంలో ఆదిరెడ్డి వాసుకు సీటు కేటాయించారు. దెందులూరు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కు ఈ జాబితాలో స్థానం దక్కలేదు. ఆయన సీటు దక్కదని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఈ జాబితాలో స్థానం ఇవ్వలేదు. మైలవరం నుంచి ఉమా సీటు ఆశిస్తున్నారు. అక్కడ వైసీపీ నేత వసంత క్రిష్ణ ప్రసాద్ ఎంట్రీతో ఆయనకే సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
ఉమాను పెనమలూరుకు మార్చే ప్రయత్నం జరుగుతుందని చెబుతున్నా..అక్కడ బోడే ప్రసాద్ సీటు తనదేనని స్పష్టం చేస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో టీడీపీ ముఖ్య నేతగా ఉన్న యరపతినేనికి జాబితాలో అవకాశం దక్కలేదు. అక్కడ వైసీపీ నేత జంగా క్రిష్ణమూర్తి ఈ నెల 26న టీడీపీలో చేరనున్నారు. జంగాకు గురజాల, నర్సరావుపేటలో ఒక స్థానం కేటాయించాలనేది చంద్రబాబు ఆలోచనగా ఉంది. దీంతో, ఇప్పుడు యరపతినేని స్థానం పెండింగ్ లో ఉంచారు. నెల్లూరు సీనియర్ నేత సోమిరెడ్డి, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆనం పేర్లు తొలి జాబితాలో లేవు. వేమిరెడ్డి టీడీపీలో చేరిన తరువాత ఈ ఇద్దరి స్థానాలు ఖరారు అయ్యే ఛాన్స్ ఉంది. ఇక, టీడీపీలో అధికారికంగా చేరకుండానే నూజివీడు నుంచి పార్ధసారధి పేరు ఖరారైంది.