బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బయట అడుగు పెట్టేందుకు కూడా వీలు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులు కూడా జలకళ సంతరించుకున్నాయి. ములుగుజిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం గంటగంటకూ పెరుగుతోంది. ఎగువన మేడిగడ్డ, సమ్మక్కసాగర్ గేట్లు ఎత్తడంతో పుష్కర్ఘాట్లకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.
ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర పర్యటించారు. గోదావరి మరింత పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా యంత్రాంగం ఇప్పటికే సిద్ధంగా ఉంది. రామన్నగూడెం పుష్కర్ఘాట్ వద్ద కరకట్ట కొన్నిచోట్ల బలహీనం కావడంతో మరమ్మతులు చేపట్టారు. కరకట్ట పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించి, లోతట్టు ప్రాంతాలైన లంబాడితండా, పాప్కాపురం, ఎలిశెట్టిపల్లె, కొండాయి, మల్యాల, ఐలాపూర్ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు ఆయన చెప్పారు. వాగుల వద్ద బోటు సౌకర్యం కల్పించామన్నారు. ఏటూరునాగారంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ దివాకర తెలిపారు.
ఇక ములుగు జిల్లా ఏటూరునాగారం మoడలం చిన్నబోయినపల్లి- తాడ్వాయి మధ్య జాతీయ రహదారిపై భారీవృక్షం కూలిపోయింది. మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ ప్రాంతంలో చెట్లు నేలకు ఒరిగిపోతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి ఏటూరునాగారం మండలం చిన్నబైనపల్లిలో భారీవృక్షం కుప్పకూలింది. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది సాయంతో రహదారిపై కూలిన చెట్లను తమ సిబ్బందితో ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్ తొలగించి, ట్రాఫిక్ను క్లియర్ చేశారు. రోడ్డు క్లియర్ చేసిన ఎస్ఐకి ప్రయాణికులు అభినందనలు తెలిపారు.