రైతుల పంటలకు గిట్టుబాటు ధరలతో పాటు, ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కిసాన్ మజ్దూర్ మహా పంచాయత్ మహాధర్నా నిర్వహిస్తోంది. దాదాపు 30 వేల మంది రైతులు, మహిళారైతులు ఢిల్లీ రామ్ లీలామైదానంలో ఆందోళనకు సిద్ధమయ్యారు.ఢిల్లీ పోలీసులు 5 వేల మందిని మించకుండా ధర్నా నిర్వహించాలని ఆంక్షలు పెట్టారు. ట్రాక్టర్లు, ట్రక్కులు ఢిల్లీ రామ్ లీలా మైదానం వైపు రాకుండా ఆంక్షలు విధించారు. కానీ, రైతులు కాలినడకన వచ్చేస్తున్నారు. జింద్ నుంచి ఉఛానా వరకూ రైలులో వచ్చి ఉఛానా నుంచి కాలినడకన ఢిల్లీ వచ్చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏడాదిగా తాము ఆందోళన చేస్తుంటే.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సాయంచేయడం లేదని బీకేయూ నాయకుడు మంజిత్ ధనేర్ అన్నారు. గతంలో రైతుల ఆందోళన సందర్భంగా ప్రభుత్వ వాగ్దానాలు నెరవేర్చాలని ఉత్తరప్రదేశ్ భారతీయ కిసాన్ యూనియన్ నేత హోషియార్ సింగ్ డిమాండ్ చేశారు.
రామ్ లీలా మైదానంలో కిసాన్ మహాపంచాయత్ కు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. ఆ పార్టీ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ.. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర 61వ రోజు ఇది. రాహుల్ గాంధీ బహిరంగ సభలు, రోడ్ షోలలో ప్రసంగిస్తారు. గతంలో రైతులపై బాష్పవాయువు ప్రయోగించేవారని, కానీ ఇప్పుడు ప్రభుత్వం వారి ఒత్తిడికి తలొగ్గిందన్నారు. చివరకు రైతులు మహాపంచాయత్ నిర్వహించుకునేందుకు అనుమతి లభించిందన్నారు.