ఉక్కపోత, వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని తెలిపింది. ఈనెల 19 కల్లా దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయని తెలిపింది.ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతా రామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షం పడొచ్చని అంచనా వేసింది. ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీసత్యసాయి, బాపట్ల, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, నంద్యాల, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా ప్రకాశం జిల్లా బల్లిపల్లిలో 79 మి.మీ. వర్షపాతం నమోదైంది. వర్షాల ప్రభావంతో ప్రజలకు వడగాలుల నుంచి ఉపశమనం లభించింది.