ఏపీలో ఓటింగ్ పోటెత్తింది. ఎలక్షన్ జాతరతో పోలింగ్ బూతులన్నీ కిటకిటలాడాయి. పల్లెల నుంచి పట్నం వరకూ ఓటర్లంతా ఓటు వేసేందుకు ఉత్సాహాన్ని కనబరిచారు. వృద్ధులు, మహిళలు, యువత జోష్తో తరలివచ్చి ఓటు వేయడంతో పోలింగ్ శాతం పెరగడంతో ఫలితాలపై అప్పుడే రాజకీయ ఉత్కంఠ నెలకొంది. మరి ఓటింగ్ శాతం పెరగడం దేనికి సంకేతమన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఏపీలో 175, అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఓటు వేయడం కోసం జనం పోటెత్తారు. ఉదయం నుంచే మహిళలు, వృద్ధులతో పోలింగ్ కేంద్రాలు కిటకిటలాడాయి. మండుటెండను సైతం లెక్కచేయకుండా జనం ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. మారుమూల గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకూ భారీ ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఈసారి పొట్ట చేతబట్టుకుని వలస వెళ్లిన వారంతా కుటుంబాలతో సహా సొంత ఊరికి తరలివచ్చి ఓటు వేయడం శుభ పరిణామం. ఇక ఈసారి కొత్తగా సుమారు 10 లక్షల మందికి ఓటుహక్కు కల్పించడం తో యువత కూడా అదే జోరుతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పోలింగ్ నమోదయింది. ఆరు గంటల్లోనే 40.26 శాతం రికార్డ్ స్థాయిలో ఓటింగ్ శాతం పెరిగింది. మొత్తంగా ఈ పరిణామాలతో ఫలితాలపై ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. ఎవరికి లాభం..? ఎవరికి నష్టమన్న అంచనాలు వేసుకుంటున్నారు అధికార, విపక్ష నేతలు.
గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం పెరగడంపై ప్రభుత్వ వ్యతిరేకతే కారణమన్న టాక్ వినిపిస్తోంది. పోలింగ్ కేంద్రాలకు జనం భారీగా తరలిరావడం తమకు లాభమేనంటోంది విపక్ష కూటమి. సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ.. జగన్ పాలనలో అభివృద్ధి శూన్యమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చడం కోసమే ఓటును ఆయుధంగా మార్చుకున్న ప్రజలు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారని.. వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చి మరీ ఓటు వేశారని చెబుతున్నారు. యువత ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు కాబట్టి,.. వారు కూడా ఓటు వేసేందుకు ఉత్సాహాన్ని కనబరిచారనే విమర్శిస్తున్నారు. ఇక తమ మేనిఫెస్టో ఆశాజనకంగా ఉండటంతోనే మహిళలు, వృద్ధులు భారీగా తరలివచ్చారని చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు. ఫ్రీ బస్సు సౌకర్యం, మూడు గ్యాస్ సిలిండర్ల హామీ, నాలుగు వేల పెన్షన్ వల్లే వారు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారంటున్నారు.
ఇక సంక్షేమ పథకాల అమలుతోనే జగన్ పాలనను కోరుకుంటూ మహిళలు, వృద్ధులు భారీగా ఓటు వేశారని అంటున్నారు అధికార పార్టీ నేతలు. పోలింగ్లో వాలంటీర్ల పాత్ర కీలకమని.. తమ పరిధిలోని యాభై ఇళ్లకు సంబంధించిన ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకు రావడం వల్లనే ఓటింగ్ శాతం పెరిగిందని చెబుతున్నారు. ఉదయాన్నే వచ్చి ఓటు వేసి వెళ్లాలని వాలంటీర్లు సూచించడం, వారు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చేలా ఏర్పాటు చేయడం వల్లనే ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారని.. తమ ప్రభుత్వాన్ని, సంక్షేమ పథకాలకు కోరుకున్నారు కాబట్టే,.. ప్రధానంగా వృద్ధులు, మహిళలు, యువకులు వచ్చి ఓటు వేశారని చెబుతున్నారు వైసీపీ నాయకులు. ఇలా ఎవరికి వారు ఓటింగ్ శాతం పెరగడం తమకు లాభమేనన్న అంచనాల్లో ఉన్నారు విపక్ష, అధికార పార్టీ నేతలు. మరి టగ్ ఆఫ్ వార్గా జరిగిన ప్రజా క్షేత్ర పోరులో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు..? ఎవరికి పట్టం కట్టారు..? ఓడేదెవెరు.., నెగ్గేదెవరు అన్నది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. అయితే,..ఈ ఫలితాలు తేలాలంటే జూన్ 4వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే.