సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఏపీలో పలు చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. అయితే ఈ గొడవలకు కారణం మీరంటే మీరంటూ వైసీపీ నేతలు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు పరస్పరం ఆరోపించుకుంటున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మల్లమ్మ సెంటర్లో జై బాలయ్య అని రాసి ఉన్న బోలోరో వాహనాన్ని వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. వాహనానికి నిప్పంటించారు. దీంతో పట్టణంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది.
అటు నంద్యాల జిల్లా ఫరూకు నగర్లో ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి కారును తెలుగుదేశం నాయకుడు తులసి రెడ్డి అడ్డుకున్నారు. ఓటు వేయడానికి వెళుతున్న టిడిపి ఓటర్ని అడ్డుకున్నాడని ఆరోపిస్తూ ఎమ్మెల్యేతో ఘర్షణకు దిగాడు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. కడప నగరంలోని 28 వార్డులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 155 156 వార్డుల్లో వైసిపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. జమ్మలమ డుగులోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది అనుకున్న సమయంలో ఒక్కసారిగా తలెత్తిన ఘర్షణ వాతావరణం ఏర్పడింది. బిజెపి, వైసిపి వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తలకు బలమైన గాయమైంది. మరోవైపు వైసీపీ నేత అన్నాబత్తుని శివ కుమార్ పోలింగ్ బూత్ వద్ద ఒకరిపై దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది.మొత్తంగా చెదురుమదురు ఘటనలు, ఓ మోస్తరు గొడవలు జరిగినా వెంటనే సర్థుకోవడంతో పోలింగ్ ప్రశాంతంగా సాగింది.