ఓవర్ టు ఢిల్లీ అంటున్నారు తెలుగు రాష్ట్రాల సీఎంలు. మంత్రివర్గ విస్తరణ, నూతన పీసీసీ చీఫ్ నియామకాల విషయంలో హైకమాండ్ నుంచి తుది ఆదేశాలు తీసుకునే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనకు వెళ్లగా విభజన హామీల అమలు, రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం, నిధుల మంజూరు వంటి అంశాలపై చర్చించేందుకు ప్రధాని సహా కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.
తెలుగు రాష్ట్రాల రాజకీయం ప్రస్తుతం హస్తినకు మారింది. కారణాలు, అజెండాలు వేర్వేరు అయినా ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అటు ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరూ కొన్ని గంటల తేడాతో హస్తిన పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రివర్గ విస్తరణ, నూతన పీసీసీ చీఫ్ నియామకం, నామినేటెడ్ పోస్టుల అంశం సహా ఇతర విషయాలపై ఫైనల్గా ఢిల్లీ పెద్దలతో మరోమారు చర్చించి గ్రీన్ సిగ్నల్ తీసుకునే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనకు వచ్చారన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే క్యాబినెట్ విస్తరణపై ఓ క్లారిటీకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలె ఢిల్లీలో హైకమాండ్ పెద్దలను కలిశారు. ఎంపీల ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీ వచ్చిన రేవంత్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతోపాటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ వంటి నేతలతో సమావేశమయ్యారు. క్యాబినెట్లో ఉన్న ఆరు ఖాళీల్లో ఎన్నింటిని భర్తీ చేయాలి. ఎవరికి అవకాశం ఇవ్వాలి అనే అంశాలపై ఢిల్లీ పెద్దల మనసులో మాట తెలుసుకున్నారు. అందుకు తగిన విధంగా మార్పులుచేర్పులు చేసి తుది ఆమోదం కోసం మరోసారి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లినట్లుగా ప్రచారం సాగుతోంది.
ఇప్పటికే మంత్రివర్గ విస్తరణపై పార్టీ సీనియర్ నేత, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే విస్తరణ ఉంటుందన్న ఆయన హోంమంత్రిగా సీతక్కకు అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్లో ఒకరికి అవకాశం దక్కవచ్చని వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు..ప్రస్తుతం మంత్రుల వద్ద ఉన్న శాఖల్లో మార్పులు, చేర్పులు సైతం ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో.. ఆశావహులు ఆ దిశగా చివరి ప్రయత్నాలు సైతం చేస్తున్నారు. మరోవైపు నూతన పీసీసీ నియామకం కూడా కొలిక్కి వచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్, బలరాం నాయక్, సంపత్ కుమార్ సహా మరికొందరి పేర్లు సైతం ప్రచారంలో విన్పిస్తున్నాయి. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన రేవంత్ రెడ్డి ఉండడంతో పీసీసీగా మరో సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలన్నది హైకమాండ్ ఆలోచనగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎస్సీలకు, లేదంటే ఎస్టీలకు అవకాశం దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉందని అంటున్నారు. అయితే దీనిపై కూడా ఫైనల్గా హైకమాండ్ తాము అనుకున్న వ్యక్తి గురించి ముఖ్యమంత్రికి సమాచారం ఇచ్చి ఆ తర్వాత ఓ ప్రకటన చేసే అవకాశం ఉందన్న మాట విన్పిస్తోంది. దీంతో ఆయా అంశాలపై పూర్తిస్థాయిలో క్లారిటీ తీసుకోవడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనకు వచ్చారని అంటున్నారు.ఇక, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా హస్తిన పర్యటనకు వచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డాతో సమావేశమవుతారు. ప్రధానంగా ఈ పర్యటనలో విభజన హామీలు, ఇతర ప్రాజెక్టులు, అంశాల్లో రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసే విషయంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతారు సీఎం చంద్రబాబు.
ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలను గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. ఇలాంటి వేళ రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి వైఖరి అవలంభిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. ప్రత్యేక హోదా ద్వారా పెద్ద ఎత్తున పన్నుల ప్రయోజనాలు దక్కుతాయి. తద్వారా ఎక్కువ సంఖ్యలో కంపెనీలు వచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లుగా 20 లక్షల ఉద్యోగాల కల్పన కూడా సులువవుతుంది. ఇప్పటికే ఈ విషయంలో బీహార్ ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా లేదంటే ప్రత్యేక ప్యాకేజీ కోసం కేంద్రం వద్ద పట్టుపడుతున్నారు. మరి ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎలాంటి వాదన విన్పిస్తారు అన్నది ఆసక్తి రేపుతోంది.
ఇక, ఏపీకి జీవనాడి లాంటి పోలవరం నిర్మాణం కూడా విభజన హామీల్లో ఒకటి. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణం చాలావరకు పూర్తైనా, ఇంకా పరిహారం విషయంలో పరిస్థితి ఏమంత సానుకూలంగా లేదు. ఇటీవలె పోలవరంలో పర్యటించిన సీఎం చంద్రబాబు తాజా పరిస్థితి చూసి భావోద్వేగానికి సైతం గుర య్యారు. అలాగే నిర్మాణం విషయంలోనూ ఓ 30 శాతం వరకు పనులు పెండింగ్లో ఉన్నట్లుగా చెబుతు న్నారు. ఇలాంటి వేళ.. కేంద్రం నుంచి తగినంత సహాయ సహకారాలు లభిస్తే ఏపీకి కేంద్రం పెద్ద మేలు చేసినట్లవుతుంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేస్తామని గతంలోనే కేంద్రం ప్రకటిం చింది. ఇప్పుడు చంద్రబాబు ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజల పాలిట కల్పవృక్షంలా ఉన్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవాల్సి ఉంది. మరి ఈ విషయంలో తెలుగు దేశం అధినేత ఎలాంటి అడుగు వేస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లోనే కాదు.సామాన్య ప్రజానీకం లోనూ చర్చ సాగుతోంది.
అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి ప్రాధాన్యం తగ్గిపోయింది. నిర్మాణాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఇక్కడి ప్రజల్లో సంతోషం వెల్లివిరు స్తోంది. పైగా చంద్రబాబు కూడా రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నామని ప్రకటించడంతో పాటు ఇటీవలె ఆ ప్రాంతంలో పర్యటించి మళ్లీ రాజధానికి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు.దీంతో మునుపటి వెలుగులు ఖాయమని ఇక్కడి వారు బలంగా నమ్ముతున్నారు. అయితే కేంద్రం నుంచి నిధులు భారీగా మంజూరు చేయించుకుంటే ఇప్పటివరకు పడకేసిన రాజధాని నిర్మాణం శరవేగంగా పూర్తవుతుంది. తద్వారా ఇప్పటివరకు రాజధాని లేని రాష్ట్రంగా పేరుతెచ్చుకున్న ఏపీకి కలల రాజధాని సొంతమవు తుంది. మరి ఈ విషయంపై కేంద్ర పెద్దలతో చంద్రబాబు ఎలా మాట్లాడతారన్నది ఆసక్తిరేపు తోంది.
కేవలం ఇవే కాదు. రాష్ట్ర, జిల్లా, గ్రామీణ రహదారుల అభివృద్ధి, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన సహా ఇతర ప్రాజెక్టుల కోసం కేంద్రంతో సఖ్యతగా మెలుగుతూ సాధ్యమైనంత ఎక్కువగా నిధులు మంజూ రు చేయించుకుంటే త్వరితగతిన రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్న మాట విన్పిస్తోంది. దీంతో వీటికి ఆర్థిక సాయం చేసే విషయాన్ని కేంద్ర పెద్దలతో జరిగే చర్చల్లో ప్రస్తావించనున్నా రు ఏపీ సీఎం చంద్రబాబు. మరి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఏ మేరకు సక్సెసవుతుంది. కేంద్రం నుంచి ఏ స్థాయి లో సహాయ సహకారాలు అందుతాయన్నది అత్యంత ఆసక్తి అంతకు మించిన ఉత్కంఠ రేపుతోంది.