ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. వైసీపీ అధినేత, సీఎం జగన్ ఇవాళ్టి నుంచి ప్రచార పర్వంలోకి దిగుతున్నారు. 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి అన్ని పార్టీల కన్నా ముందంజలో ఉన్న వైసీపీ అధినేత.. ఇవాళ్టి నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేశారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ఏపీ వ్యాప్తంగా జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు మొత్తం 21 రోజుల పాటు జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది.
మధ్యాహ్నం సీఎం జగన్ ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత సీఎం వైఎస్సార్ ఘాట్ వద్ద.. ప్రార్థనల అనం తరం ‘మేమంతా సిద్ధం’ యాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం ప్రొద్దుటూరులో జగన్ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఉదయం స్థానిక నేతలతో సమావేశాలు.. సాయంత్రం బహిరంసభలు నిర్వహించేలా వైసీపీ నాయకత్వం ప్లాన్ చేసింది. సిద్ధం సభలు జరిగిన 4 ఎంపీ నియోజకవర్గాలు మినహా 21 చోట్ల బస్సు యాత్ర చేపడుతున్నారు. బస్సు యాత్రలో రోజూ ఉదయం ప్రజలు, మేధావులతో సీఎం సమావేశం నిర్వహిస్తారు. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవడానికి సలహాలు, సూచనలను స్వీకరిస్తారు. సాయంత్రం ఆయా చోట్ల జరిగే బహిరంగ సభలకు జగన్ హాజరవుతారు.
ఇడుపులపాయ నుంచి వేంపల్లి వరకు దారి పొడుగునా మేమంతా సిద్ధం పేరుతో జెండాలను ఏర్పాటు చేశారు. జగన్ ప్రయాణించే బస్సును కూడా సిద్ధం చేశారు. బస్సులో 11 సీట్లను ఏర్పాటు చేయడం జరిగింది.వైయస్సార్ ఘాటు ను ప్రత్యేకంగా చెప్పించిన పూలతో అందంగా ముస్తాబు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12 : 45 నిమిషాలకు సీఎం జగన్ ఇడుపులపాయకు రానున్నారు. 1: 20 నిమిషాలకు దివంగత నేతకు నివాళులర్పిస్తారు. 1:30 కు ఇడుపులపాయలో బయలుదేరి వేంపల్లి మీదుగా రోడ్ షో నిర్వహిస్తూ ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొం టారు.