కష్టాల్లో కూడా మంచి బడ్జెట్ను ప్రజలకు అందించామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ రూపకల్పన చేసినట్లు చెప్పారు. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రజలు గుర్తించారన్నారు.
ఈ బడ్జెట్ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదే అని అన్నారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అవగాహన పెంచుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఎమ్మెల్యేల పనితీరులో మార్పు రావాలని చెప్పారు. మళ్లీ సభకు రావాలి.. అనే భావనతో ఎమ్మెల్యేల పనితీరు ఉండాలని పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. ఎక్కడా విభేదాలకు తావులేదని.. గ్రూపులు సహించబోనని చంద్రబాబు తేల్చి చెప్పారు.