ఓ చర్చి ప్రాంగణంలో 251 మంది చిన్నారులను కట్టుబానిసల్లా వినియోగించుకుంటూ పనులు చేయిస్తున్న అమాన వీయ ఘటన జింబాబ్వేలో వెలుగు చూసింది. రాజధాని హరారేకు 34 కిలోమీటర్ల దూరంలోని ఈ చర్చిలో పోలీసులు దాడులు నిర్వహించారు. మత బోధకుడిగా చెప్పుకొంటున్న ఇషామెల్ చొకురొంగెర్వ అనే వ్యక్తి మాటలకు ఆకర్షితులై వెయ్యి మందికి పైగా పురుషులు, మహిళలు చర్చి ప్రాంగణంలోనే బతుకీడుస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అక్కడ 16 సమాధులను గుర్తించామని, వాటిలో ఏడు చిన్నారులవి కూడా ఉన్నట్లు తెలిపారు. చిన్నారులను అక్కడి నుంచి పోలీసులు తరలించే ప్రయత్నం చేయగా మహిళలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఇషామెల్ చొకురొంగెర్వను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.