మహాశివరాత్రి అంటే దక్షిణ భారతదేశంలో అందరికీ గుర్తుకొచ్చే ఏకైక క్షేత్రం శ్రీశైలం. మహా లింగోద్భవ కాలానికి శ్రీశైలం చేరుకోవాలనే సంకల్పంతో పాదయాత్రగా బయలుదేరారు భక్తులు. పాదయాత్రగా భక్తులు శ్రీశైలం ఎందుకు వెళ్తున్నారు…? ఈ యాత్రకు ఎన్ని వందల ఏళ్లనాటి చరిత్ర ఉంది…? కాలినడకన ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాలి…? భక్తులకు మార్గమధ్యంలో ఉన్న సౌకర్యాలు, మజిలీలు ఎన్ని, చారిత్రాత్మక, ఇతిహాస నేపథ్యమున్న యాత్ర అసలు చరిత్ర ఏంటి..? ఈ పరంపర ఎందుకు కొనసాగుతుంది..? వీటితో పాటు మరెన్నో ప్రత్యేక విషయాలను తెలుసుకుందాం పదండి…స్వతంత్ర టీవీ వెంట..వెళ్లి నల్లమలలోని శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునుడి అనుగ్రహాన్ని పొందుదాం.
అలా కైలాసాన్ని విడి ఇలా కైలాస శ్రీశైల క్షేత్రంలో శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జుని రూపంలో కొలువైన ఆదిదేవుడు పరమేశ్వరుడికి…మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీశైల కైలాస పర్వతంపై కొలువైన ఆదిదంపతుల దర్శనం కోసం భక్తులు అరణ్యాల గుండా, పర్వతల గుండా పాదయాత్రగా బయలుదేరారు. దట్టమైన నల్లమల్ల అరణ్యం మధ్యలో ఉన్న శ్రీశైల క్షేత్రానికి పూర్వం వందల ఏళ్ల నాటి నుంచే 20 దారులు ఉండేవి. కాలక్రమేనా రెండు దారులే భక్తులకు మిగిలాయి. ఇందులో కీలకమైంది అతి ప్రాచీనమైన నడకదారి ఆత్మకూరు, శ్రీశైలం అరణ్య మార్గం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పెద్ద పులుల అభయ అరణ్యం పరిధిలో ఉన్న అటవీ మార్గం గుండా ప్రతి సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఐదు లక్షల మందికి పైగా భక్తులు 45 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి 24 గంటల్లో శ్రీశైలం చేరుకుంటారు.
మహారాష్ట్ర, కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు..ఆత్మకూరు నుంచి వెంకటాపురం గ్రామం మీదుగా నల్లమల్ల అడవిలోకి ప్రవేశిస్తారు. అక్కడి నుంచి గోసాయి కట్ట ఆంజనేయ స్వామి ఆలయం..ఆలయ సమీపంలో కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వారు లక్షలాది మందికి అన్నదానం చేస్తుంటారు. శ్రీశైలం క్షేత్ర పాలకుడు నాగులుటి వీరభద్రాలయం చేరుతారు. అక్కడి నుంచి ప్రారంభమయ్యే 8 కిలోమీటర్ల రెడ్డి రాజులు కట్టించిన మెట్ల మార్గం ద్వారా..రెండు గాలి గోపుర ముఖ ద్వారాలు దాటి తామర్లకుంట, పెచ్చేరులో బస చేసి విశ్రాంతి తీసుకుంటారు. అక్కడికి మొదటి మజిలీ పూర్తి అవుతుంది.
ఒకనాటి నల్లమల్ల చెంచు గిరిజనుల రాజధాని కేంద్రం నల్లమల్ల పెచ్చేరుగూడెం..ఈ ప్రదేశంలో వేలాది మంది పాదయాత్ర భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి విశాల గడ్డి మైదానాలు ఉన్నాయి. ఇక్కడ 24 గంటలపాటు పది రోజులు ఎందరో దాతలు భక్తులకు స్వచ్ఛందంగా అన్న ప్రసాదాలు అందించి వారి ఆకలి తీరుస్తుంటారు. దీనికి ముందు మజిలీ నాగులుటి వీరభద్రలయం వద్ద 29 సంవత్సరాలుగా బాల శంకర్ రెడ్డి అనే భక్తుడు అన్నదాన శిబిరాన్ని నిర్వహిస్తూ..లక్షలాది మంది భక్తుల ఆకలి తీరుస్తున్నారు. పెచ్చేరు నుంచి బయలుదేరిన భక్తులకు 6 కిలోమీటర్ల మెట్ల మార్గం ద్వారా వెళ్లి సీతమ్మ బావి (మఠం బావి) కత్తుల కొండ మీదుగా భక్తులు వెళ్తుంటారు. ఈ కొండమీదుగా భక్తులు వెళ్తూ మనసులోని కోరికలు కోరుకుంటారు. అందుకే ఈ కొండను కోర్కెల కొండ పిలుస్తారు. ఇక్కడి నుంచి మైదాన ప్రాంతం గుండా నడక ప్రారంభమై భీముని కొలను లోయ ప్రవేశ అంచులకు చేరుకుంటారు. ఇతిహాసాల్లో పాండవులు అరణ్యవాసంలో ఉండగా దాహం వేస్తే..ఈ లోయ రాతి బండలను గదాతో పగలగొట్టి నీటిని సేకరించిన ప్రాంతంగా, భీముని కొలను లోయ అంటారు. సుమారు 2000 అడుగుల లోయలోకి మెట్ల మార్గం గుండా దిగి అదే ఎత్తుకు చేరుకుంటే పరమశివుడు ఏకాంతవాసంగా కొలువైన కైలాస ద్వారం చేరుకుంటారు. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలానికి చేరే క్రమంలో హఠకేశ్వరం, ఫాలధార, పంచదార, సాక్షి గణపతినీ సందర్శించి శ్రీశైలం వరకు మైదాన ప్రదేశం ద్వారా శ్రీశైల క్షేత్రం చేరుకుంటారు.
ఇలా పాదయాత్రికులు, శివ స్వాములు 45 కిలోమీటర్ల దూరాన్ని రెండు రోజుల్లో నడుచుకుంటూ. .నల్లమల్ల పకృతి అందాలను తెలుపుతూ..చరిత్ర, ఇతిహాస, పురాణ విశేషాలను తెలుసుకుంటూ.. అడుగడుగున దాతల అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తూ…మహాశివరాత్రి సందర్భంగా శ్రీగిరి పర్వతాన్ని చేరు కుంటారు. లక్షలాది మంది పాదయాత్రలకు అటవీ మార్గంలోనే శ్రీశైలం దేవస్థానం వారు శీఘ్రా దర్శన టోకెన్లను అందిస్తున్నారు. వేల మంది దాతలు, లక్షల మంది భక్తులకు అటవీ మార్గంలో అల్పాహారం భోజన వసతులు సమకూర్చి సహకరిస్తున్నారు. యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డ నేటి మనిషిలో ఆధ్యాత్మికత చింతన, భక్తి భావం తగ్గిపోతున్న పరిస్థితుల్లో మహాశివరాత్రికి నల్లమల్ల అరణ్యం గుండా శ్రీశైలం క్షేత్రానికి నడక మార్గంలో వెళ్లడం కొంత వరకు మనిషికి హడావుడి జీవనం నుంచి కొంత వెసులుబాటు కల్పించి ఆధ్యాత్మిక భావం పెంపొందించుకునేందుకు ఇది ఒక మార్గమని మానసిక శాస్త్రవేత్తలు ఆధ్యాత్మిక ప్రవచన కారులు చెబుతున్నారు.