మొయినాబాద్ (Moinabad) ఫామ్హౌస్లో ఇద్దరు మహిళల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పులు ఇచ్చిన వారిని తిరిగి డబ్బులు అడిగితే వారినే హత్య చేసి తప్పించుకోవాలనే భయానక ప్లాన్తో కరీమాబీ( Karimabi) దంపతులు వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసుల దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం, కరీమాబీ దంపతులు వివిధ వ్యక్తుల నుంచి భారీగా అప్పులు తీసుకున్నారు. అయితే అప్పులు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి రావడంతో, డబ్బులు అడిగే వారినే ఒక్కొక్కరిని హత్య చేయాలని పక్కా ప్రణాళిక రచించినట్లు తేలింది. మొత్తం ఎనిమిది మందిని టార్గెట్ చేసిన ఈ దంపతులు ముందుగా ఇద్దరు మహిళలను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తాండూరుకు చెందిన ఇద్దరు మహిళలను డబ్బులు ఇస్తామని నమ్మించి ఫామ్హౌస్కు పిలిపించి అక్కడే హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసు వెలుగులోకి రావడంతో మరింత లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు, ఇంకా ఆరుగురిని కూడా ఇదే తరహాలో హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు.
అయితే టార్గెట్లో ఉన్న ఆరుగురు మహిళలకు తమ ప్రాణాలకు ముప్పు ఉందని అనుమానం రావడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కరీమాబీ నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్రమత్తమై విచారణను వేగవంతం చేశారు.
ఈ ఘటనతో మోయినాబాద్ ప్రాంతంలో కలకలం రేగింది. అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా, అప్పు ఇచ్చిన వారినే హత్య చేయాలనే దారుణ కుట్ర బయటపడటంతో స్థానికులు షాక్కు గురయ్యారు. పోలీసులు ప్రస్తుతం కేసులో మరిన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


