AP&TS Weather Alert | ఏపీలో నేడు, రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ సూచించింది. వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాలతో పాటుగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి విస్తరించిందని.. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో ఈ నెల 25 వరకు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇదే సమయంలో ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది.
అధిక ఉష్ణోగ్రతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు అందించింది. శని, ఆదివారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఉపరితల ఆవర్తనం దృష్ట్యా రానున్న ఐదు రోజుల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గుతాయని వెల్లడించింది.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అనకాపల్లి, ఏలూరు, కాకినాడ జిల్లాల్లోని పది మండలాల్లో శుక్రవారం వడగాల్పులు వీచాయి. పలు చోట్ల 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లా కమలాపురంలో అత్యధికంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణాలో గరిష్ఠంగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 42.5, నల్గొండ జిల్లా కట్టంగూరులో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది.