పుప్పాలగూడలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పుప్పాలగూడ–ఖాజాగూడ ప్రాంతంలో సుమారు 200 ఎకరాల ప్రభుత్వ (హెచ్ఎండీఏ) భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఆక్రమణల నుంచి రూ.30 వేల కోట్ల విలువైన భూమిని హైడ్రా రక్షించింది. 250 కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన రాతి గుట్టలు, పురాతన గుహలను సంరక్షించింది.
హైకోర్టు 2019 ఆదేశాల మేరకు రక్షణ చర్యలు చేపట్టారు అధికారులు. సొసైటీ టు సేవ్ రాక్స్ ఫిర్యాదు నేపథ్యంలో హైడ్రా చర్యలు చేపట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్( A. V. Ranganath ) క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో కలిసి భూమి ప్రభుత్వానిదేనని నిర్ధారించారు. చారిత్రక రాతి గుట్టలను కాపాడినందుకు పర్యావరణవేత్తలు, స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఆలయాలు, దర్గా పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టవేశారు. సమీపంలోని భగీరథమ్మ చెరువు పునరుద్ధరణ పనులు కూడా కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


