తెలంగాణలో పెట్రోల్, డీజిల్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్బీజీ) డిమాండ్కు అనుగుణంగా అందుబాటులో ఉందని, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కొరత లేదని తెలంగాణలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) స్పష్టం చేశాయి. సరఫరాను ప్రభుత్వ రంగ ఓఎంసీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, రవాణా, సరఫరా సేవలను మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పత్రికా ప్రకటనలో ఓఎంసీల రాష్ట్ర కో-ఆర్డినేటర్ వెల్లడించారు. ఈ నెల మొదటి 15 రోజుల్లోనే పెట్రోల్ సరఫరాలో 14.2 శాతం, డీజిల్ సరఫరాలో 15.7 శాతం వృద్ధిని ఓఎంసీలు నమోదు చేశాయి.
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా గృహావసర ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్స్ తగ్గుముఖం పట్టాయి. ఆందోళనతో వినియోగదారులు ముందస్తు బుకింగ్స్ చేయటం లేదు. తెలంగాణలో ఈ నెలలో నిన్నటి వరకు మొత్తం 20.06 లక్షల గృహావసర ఎల్పీజీ సిలిండర్లను డెలివరీ చేశామనీ, ఈ సీజన్కు ఇది సాధారణమని ఓఎంసీలు తెలిపాయి. ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్, ఐవీఆర్ఎస్, ఆన్లైన్ వేదికల ద్వారా ఎల్పీజీ సిలిండర్లు బుక్ చేసుకోవాలని ఎల్పీజీ వినియోగదారులను కంపెనీలు ప్రోత్సహించాయి.
ఎల్పీజీ సిలిండర్ల విషయంలో అక్రమాలను అరికట్టేందుకు, అసలైన లబ్ధిదారులకు అందేలా చూసేందుకు ఓటీపీ ఆధారిత సిలిండర్ డెలివరీ విధానమైన డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డీఏసీ) వ్యవస్థను అనుసరించాలని కోరుతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం డీఏసీ విధానం 95 శాతానికి పైగా అమలవుతోంది. రాష్ట్రంలో డీఏసీ అమలు శాతాన్ని వంద శాతానికి చేర్చేందుకు ఓఎంసీలు, గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారుల సహకారాన్ని కోరుతున్నాయి. నకిలీ వార్తలు, వదంతులను నమ్మి మోసపోవద్దని.. విశ్వసనీయ సంస్థలు అందించే వార్తలను మాత్రమే విశ్వసించాలని సామాన్య ప్రజలకు ఓఎంసీలు మరోసారి విజ్ఞప్తి చేశాయి.


