సుప్రీంకోర్టు (Supreme Court of India) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్( Justice Surya Kant) దేశంలోని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు కీలక సూచనలు చేశారు. కేసుల విచారణలో సుప్రీంకోర్టు అనుసరిస్తున్న విధానాన్ని హైకోర్టులు కూడా అమలు చేయాలని సూచించారు.
ప్రత్యేకంగా ప్రతి సోమవారం, శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ నిర్వహించాలని సూచించినట్లు తెలిపారు. ఇవాళ సుప్రీంకోర్టులోని అన్ని బెంచ్లలో వర్చువల్ విధానంలో విచారణలు జరిగాయి.
ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి( Mukul Rohatgi) మాట్లాడుతూ… వర్చువల్ విచారణలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా జరిగాయని పేర్కొన్నారు. ఇదే విధానాన్ని దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో కూడా అమలు చేయాలని సీజేఐకి విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, ఇప్పటికే గత శుక్రవారం అన్ని హైకోర్టుల సీజేలకు తగిన సూచనలు జారీ చేసినట్లు వెల్లడించారు.


