విభజన తర్వాత రెండు టర్మ్ల అనంతరం అతి కష్టం మీద తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్కు ఈ పరిస్థితి రావడానికి ఒక విధంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అని కూడా చెప్పొచ్చు. మరి అలాంటి జగన్ పేరును ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేతలు మర్చిపోలేకపోవడం ఆసక్తి రేకెత్తించే అంశమనే చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో జగన్ కడప ఎంపీగా కొనసాగిన సంగతి తెలిసిందే.
తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన విషాదంలో ఉన్న జగన్.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో సొంత పార్టీ నేతను శత్రువుగా భావించింది పార్టీ. ఆయనపై కేసులు పెట్టడమే కాకుండా జైలుకు కూడా పంపించింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు కదా.. అదే విధంగా జగన్ కూడా సొంత కుంపటి పెట్టారు. సొంత పార్టీ వైసీపీని స్థాపించి కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బ తీశారు. పార్టీకి నష్టం చేసినా కొంత మంది నేతలు జగన్ను మర్చిపోని వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. అది కూడా ఏ సంబంధం లేని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో.
అసలు విషయంలోకి వెళితే.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త ఇంఛార్జ్గా నియమితులైన మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ వచ్చారు. నూతన ఇంఛార్జ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా పీసీసీ ఓ సమావేశం ఏర్పాటు చేసింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటైన సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కీలక నేతలు అందరూ హాజరయ్యారు. నేతలు ఒక్కొక్కరిగా మాట్లాడుతున్నారు. పార్టీ అంశాలు, మీనాక్షి నటరాజన్ గురించి చెబుతూ వచ్చారు. ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చంటూ మహేశ్ కుమార్ గౌడ్ నేతలను కోరారు. ఇక్కడే ఓ ఆసక్తికర ఘటన జరిగింది.
అప్పుడే మైక్ తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ బెల్లయ్య నాయక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులే కాకుండా సామాన్య కార్యకర్తల నుంచి కూడా సలహాలు , సూచనలు తీసుకోవడం బాగుందని.. ఇక ముందు కూడా ఇదే విధానం కంటిన్యూ చేయాలని కోరాడు. దీంతో ప్రసంగం ముగిసిందని చెబుతూ.. జై జగన్ అంటూ ఆయన ఓ నినాదం చేశాడు. ఈ పదం విన్న అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అయితే ఇది పొరపాటుగా అన్నారేమో అనుకుని అందరూ సైలెంట్ అయ్యారు. అయితే బెల్లమ్ నాయక్ నోట నుంచి వచ్చిన జై జగన్ నినాదాన్ని ఓ సంస్థ సోషల్ మీడియాలో వీడియో పెట్టింది. ఇది కాస్తా వైరల్ అయింది.