యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతీ నియోజకవర్గంలో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ స్థలాల సేకరణ, ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వంద నియోజవర్గాల్లో నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. నియోజకవర్గాల్లో స్థలాల కేటాయింపుల్లో పూర్తయిన వాటికి అనుమతులకు సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత స్థలాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు.