కాళేశ్వరం ప్రాజెక్టుపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ఫోకస్ పెట్టిన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే హైడ్రాలజీ, నిపుణుల కమిటీ ఇంజినీర్లను విచారించిన కమిషన్ ఇవాళ మరికొందరు అధికారులను విచారిస్తోంది ఈ క్రమంలోనే ఈఎన్సీ జనరల్ కార్యాలయంలోని ఇంజినీర్లు, ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలోని ఇంజినీర్లు కమిషన్ ఎదుట హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి వారి పాత్ర, సంబంధిత అంశాలపై ఆరా తీస్తోంది. అయితే, ఎక్కువ నీటిని నిల్వ చేయడం వల్లే సమస్య తలెత్తిందని చెప్పినట్టు తెలుస్తోంది. రెండు వారాల లోపు మధ్యంతర నివేదిక, సాధ్యమైనంత త్వరగా పూర్తిస్థాయి నివేదికను అందించాలని రెండు కమిటీల ఇంజినీర్లను కమిషన్ ఆదేశించింది. టెక్నికల్ అంశాలపై అఫిడవిట్ ఫైల్ చేయాలని నిపుణుల కమిటీలకు సూచించింది. అఫిడవిట్ల పరిశీలన తర్వాత బహిరంగ విచారణ చేసేందుకు జస్టిస్ పీసీ ఘోష్ సిద్ధమవుతున్నారు. ఇందులో సంబంధం ఉన్న వారికి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటిపారుదల మంత్రి హరీష్కు నోటీసులు ఇచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.


