గూడూరు..! ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న కీలక నియోజకవర్గాల్లో ఒకటి. రాజకీయంగానే కాదు.. రవాణా పరంగానూ అత్యంత కీలకమైన రైల్వే జంక్షన్ కూడా. ఒకప్పుడు ఇక్కడి నుంచి ఎన్నికై శాసనసభలో అడుగు పెట్టిన నేతలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో.. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రోగ్రెస్ రిపోర్ట్.
ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే… గూడూరుకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్లు, ఇక్కడ పోటీ చేసి గెలుపొంది రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలు, ముఖ్యమంత్రి పీఠం వరకు వెళ్లిన వారు ఉన్నారు. ఈ నియోజక వర్గానికి చెందిన వారు, ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందిన వారి గురించి చెప్పుకోవాలంటే ఒకరు మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కాగా, ఇంకొకరు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి. వీరిద్దరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చక్రం తిప్పినవారే కావడం గమనార్హం.
గూడూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా 2019 ఎన్నికల్లో పోటీ చేసిన వరప్రసాద్ రావు.. టీడీపీ అభ్యర్థి పాశిం సునీల్కుమార్ పై 45 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే.. ఇది ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఇక్కడ రెడ్ల పెత్తనమే ఎక్కువన్న విమర్శలున్నాయి. వారు చెప్పిందే వేదం.. చేసిందే శాసనమన్న వాదన విన్పిస్తోంది. దీనికితోడు ఎమ్మెల్యే వ్యవహార శైలి కూడా నిత్యం వివాదాస్పదంగా మారిందన్న అభిప్రాయం ఎక్కువగా విన్పిస్తోంది. దీంతో.. నియోజకవర్గం లో అభివృద్ధి ఎంత మేర జరిగింది అంటే ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదన్న వాదన విన్పిస్తోంది. గ్రూపు రాజకీయా లు కూడా జరగడంతో కేవలం నవరత్నాలు మినహా పెద్దగా చెప్పుకోదగిన అభివృద్ధి ఎమ్మెల్యే వైపు నుంచి ఏమీ లేదన్న మాట ఎక్కువగా వినిపిస్తోంది. వివిధ రకాల సమస్యలు చెబుతూ పరిష్కరించాలని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే వద్దకు వెళ్లినా ఒరిగిందేమీ లేదని ఆరోపిస్తున్నారు. దీంతో.. వైసీపీ సర్కారు వచ్చిన రెండేళ్లలోపే ఎమ్మెల్యే పనితీరు సరిగా లేదంటూ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో..సీరియస్ అయిన పార్టీ అధినేత వై.ఎస్ జగన్ పిలిచి మందలించారు. అయినా.. ఆయన వ్యవహార శైలిలో మార్పేమీ లేదన్న నివేదికలు తాడేపల్లి పెద్దలకు చేరినట్లు తెలుస్తోంది.
మరోవైపు.. గూడూరులో ఖనిజ సంపద ఎక్కువ. దీంతో.. ఇసుక, గ్రావెల్ సహా ఇతర సహజవనరులపై నేతల కన్ను పడిందని.. ఎమ్మెల్యే వరప్రసాద్ తన కుమారుడితో కలిసి వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున విన్పిస్తు న్నాయి. ఇలా ఒకటీ రెండూ కాదు.. ఎమ్మెల్యేపై సామాన్య ప్రజానీకమే కాదు.. ప్రతిపక్షాలు సైతం పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నాయి. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వసతి..ఇలా ఒకటేమిటి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సమస్యలే అధికంగా కన్పిస్తున్నాయన్న వాదన విన్పిస్తోంది. దీనికితోడు వానాకాలంలో వచ్చే సమస్యలు అదనం. అయితే.. రోజురోజుకూ ఎమ్మెల్యే గ్రాఫ్ పడిపోతుండడంతో అధిష్టానం చివరకు కఠిన నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో భాగంగా వరప్రసాద్ స్థానంలో మరొకరిని రానున్న ఎన్నికలకు బరిలో దింపింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. నియోజకవర్గంలో సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి. గూడూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య ప్రజలను ఎక్కువగా వేధిస్తోంది. చిట్టమూరు మండలంలోని మొలకలపూడి, చిల్లమూరు, రామాపురం గ్రామాల్లో తాగు నీటి కోసం మహిళలు నాలుగైదు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. పరిస్థితి ఇలా ఉన్నా.. ఎమ్మెల్యే వరప్రసాద్ మాత్రం వీటి గురించి పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. దీంతో.. కోట, వాకాడు, చిట్టమూరు ప్రాంతాల్లో కొంత మంది ప్రజలైతే మా ఎమ్మెల్యే ఎవరన్నది తెలియదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది.
కేవలం ఇదే కాదు.. గూడూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో రవాణా వ్యవస్థ అంతంత మాత్రమేనని చెప్పాలి. రహదారుల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదన్న అభిప్రాయం విన్పిస్తోంది. అంతేకాదు.. కోట పట్టణాన్ని మున్సిపాలిటీ చేయాలని, మెట్ట ప్రాంతమైన చిట్టమూరు మండలంలో తాగునీరు, సాగునీరు సమృద్ధిగా అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు ఎన్నో మార్లు కోరారు. అయినా వర ప్రసాద్ హయాంలో లాభం లేకపోయిందన్న విమర్శలున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఎమ్మెల్యే వరప్రసాద్ కారణంగా నియోజకవర్గంలో అభివృద్ధి అన్నది మచ్చుకు కూడా కన్పించడం లేదన్న అభిప్రాయం అందరిలోనూ విన్పిస్తోంది. దీంతో.. ఇప్పటికే పలుమార్లు ఆయన్ను హెచ్చరించిన అధిష్టానం.. ఎమ్మెల్యే వ్యవహార శైలిలో మార్పు లేకపోవడంతో కొత్తగా మురళికి గూడూరు టికెట్ ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో.. ఇప్పటికే ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటు లో లేకుండా పోయారన్న విమర్శలు న్నాయి. ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టించుకోకపోగా.. అవి చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలకు కనీసం సమయం కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే దాటవేసేవారన్న విమర్శలున్నాయి. దీంతో గూడూరు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే వరప్రసాద్కు వందకు నలభై మార్కులు వేశారు. దీంతో 2024 ఎన్నికల్లో విజయం కోసం వైసీపీ అధిష్టానం నూతన అభ్యర్థి మేరిగ మురళీధర్ ను బరిలోకి దింపింది. మరి వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయం పార్టీకి ఎంతమేరకు కలిసి వస్తుంది? ప్రజలు మేరిగ మురళీ ధర్ పై ఎలా స్పందిస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థిని చూసి ఓట్లు వేస్తారా? లేదా సంక్షేమ పథకాలను చూసి ఓట్లు వేస్తారా ? లేక ప్రజలు టర్న్ తీసుకుంటారా? అనేది వేచి చూడాల్సిందే.