వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలపడం కోసం గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే 94 మందితో ఒక అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన చంద్రబాబు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల రెండో జాబితాను టీడీపీ ఇవాళ విడుదల చేయనుంది. సుమారు 25 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లతో పాటు 10 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం టీడీపీ 94 మందితో తన తొలి జాబితా విడుదల చేసింది. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీలకు 31 స్థానాలను కేటాయించిన టీడీపీ 144 సీట్లలో బరిలోకి దిగనుంది. తొలి జాబితా పోను ఇంకా 50 సీట్లలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.రెండో జాబితాలో భాగంగా కొంతమంది ఎంపీ అభ్యర్థుల పేర్లు సైతం ప్రకటించనున్నారు. ఇక బీజేపీ, జనసేనకు సంబంధించి ఎక్కడ పోటీచేయాలనే విషయంలో ఆ రెండు పార్టీలు స్పష్టతతో ఉన్నాయని చంద్రబాబు అన్నారు. సీట్లు రాని నేతలకు పార్టీ న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. పొత్తులో భాగంగా కొన్నిసార్లు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందని. ఈ విషయాన్ని నేతలు అర్థం చేసుకోవాలని సూచించారు.
మరోవైపు టీడీపీ, జనసేన ఉమ్మడిగా ఇప్పటికే అభ్యర్థుల జాబితా విడుదల చేశాయి. మొత్తం 99 మందితో లిస్టు విడుదల చేయగా.. అందులో 94 మంది టీడీపీ, ఐదుగురు జనసేన అభ్యర్థులు ఉన్నారు. అయితే ఇవాళ 50 మంది అభ్యర్థులతో చంద్రబాబు రెండో జాబితా విడుదల చేస్తారని సమా చారం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సీట్ల కేటాయింపులో టీడీపీకి 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లు.. జనసేనకు 21 ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లు, బీజేపీకి 10 అసెంబ్లీ, 6 ఎంపీ సీట్లు కేటాయించారు. ఇప్పటికే 94 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన టీడీపీ.. ఇబ్బందులు లేని మరో 50 స్థానాలకు గురువారం అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం. ఇక తొలి జాబితాలో గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ చౌదరి సహా పలువురు సీనియర్ నేతల పేర్లు లేవు. రెండో లిస్టులో వారి పేర్లు ఉంటాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
టీడీపీ టికెట్లను ఆశిస్తున్న పలువురు నేతలు అధినేత చంద్రబాబును కలిశారు. విశాఖ జిల్లా భీమిలి సీటు ఆశిస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. మాజీ మంత్రి పొంగూరు నారాయణ చంద్రబాబును కలిశారు. గంటాను చీపురుపల్లి లో పోటీ చేయించాలని చంద్రబాబు యోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కూడా చంద్రబాబును కలిసి.. కోవూరు అసెంబ్లీ అభ్యర్థి ఎంపికపై చర్చించినట్లు సమాచారం. కడప జిల్లా జమ్మలమడుగు ఇన్చార్జి భూపేశ్రెడ్డి, బద్వేలు ఇన్చార్జి రితేశ్ రెడ్డి, ప్రొద్దుటూరు ఇన్చార్జి ప్రవీణ్కుమార్రెడ్డి కూడా పొద్దుపోయాక చంద్రబాబును కలిసి మాట్లాడారు. తమ సీట్లలో నెలకొన్న సమస్యల గురించి వారు చర్చించినట్లు సమాచారం. జమ్మలమడుగు, బద్వేలు పొత్తులో బీజేపీకి పోవడంతో దానిపై మాట్లాడేందుకు ఆ నియోజకవర్గాల నేతలు వచ్చారు.


