ఏపీ రాజకీయ రాజధాని విజయవాడలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ – జనసేన కూటమి ప్రచారం వేడి అందుకుంది. అడుగడుగునా కటౌట్లు, ఫెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ టిక్కెట్ పంచాయతి మాత్రం ఓ కొలికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రాజకీయ హేమా హేమీలు దేవినేని ఉమామహేశ్వరరావు, వసంత కృష్ణప్రసాద్ లలో ఎవరు పోటీ చేస్తారో.. ఎవరికి మొండిచేయి చూపు తారో అర్థంకాక కార్యకర్తలు పరేషాన్ లో ఉన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు కూడా మైలవరం టికెట్ ఆశిస్తుండడంతో గోదాలో ఎవరు దిగుతారో
చూడాలి.
టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమ కు ఫస్ట్ లిస్ట్ లోనే టికెట్ కేటాయిస్తారని అంతా భావించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మార్చి 2 వ తేదీన టీడీపీలో అధికారికంగా చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సమీకరణలు మారుతున్నాయా అని కార్యకర్తలలోనే సందేహాలు నెలకొన్నాయి. అయితే రెండో లిస్ట్ లో తన పేరు ఉంటుందని దేవినేని ఉమ ధీమాగా చెబు తున్నారు. కమ్మ సామాజిక వర్గంలో మెజార్టీ నేతలు వసంత కృష్ణ ప్రసాద్ కు జై కొడుతుంటే బీసీ, ఎస్సీ సామాజిక వర్గ నేతలు మాత్రం దేవినేని ఉమామహేశ్వరరావుకు అండగా ఉన్నట్లు తెలుస్తోంది. వసంత కృష్ణ ప్రసాద్ వల్ల ఇబ్బందులు పడ్డ టీడీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తప్ప ఎక్కడా బహిరంగంగా చెప్పడం లేదు.
తెలుగుదేశం టికెట్ గ్యారంటీగా వస్తుందన్న పూర్తి నమ్మకంతో ఉన్న వసంత కృష్ణప్రసాద్ చాపకింద నీరులా తన వ్యహరచన చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో టీడీపీ ముఖ్య నాయకుడు, రెడ్డిగూడెంలో మరో ప్రముఖ నాయకుడు, మైలవరం,జి. కొండూరు మండల నాయకులు ద్వారా తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. వైసీపీలో తన మద్దతు దారులను సంప్రదిస్తూ.. మద్దతు కూడగట్టుకుంటున్నారు. కొండ పల్లి మున్సిపాలిటీ అధికార పార్టీ కౌన్సిలర్లు కొంత మంది మద్దతు తెలుపగా మరి కొంతమంది నాయ కులు ఐతవరంలో వసంత కలిసి అండగా ఉంటామని చెబుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ చేరేం దుకు సిద్దమైన వసంత ఇప్పటి వరకూ ప్రత్యక్షంగా పార్టీ నాయకులను, కార్యకర్తలను కలవకపో వడం కొంత ఇబ్బందికరంగా ఉంది. నాయకులకు ఫోన్లు చేసినా, వారి నుంచి సరైనా స్పందన లేదని తెలు స్తోంది.
సీనియర్ రాజకీయవేత్త వసంత నాగేశ్వరావు కూడా కొడుకుకు మద్దతుగా కూడా చర్చలు జరుపు తున్నా… వారి నుంచి స్పందన లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతికూల పరిస్థితులు ఉన్నా… వసంత మాత్రం మైలవరం నుంచే పోటీ చేస్తానని తనను కలిసి వైసీపీ, టీడీపీ నాయకులకు కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. మరో వైపు దేవినేని ఉమ మాత్రం తనకు ఉన్న అన్నీ దారుల నుంచి పట్టు వదలని విక్రమార్కుడులా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. మైలవరం నుంచి వసంత పోటీ చేస్తాడా లేక ఉమా పోటీ చేస్తాడా అనే విషయం రెండు, మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


