స్వతంత్ర వెబ్ డెస్క్: కేవీపీపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేవీపీ చేసిన కామెంట్స్కు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విభజన వద్దని ప్లకార్డులు పట్టుకున్నప్పుడు కేవీపీకి తెలంగాణ గుర్తుకు రాలేదా అని వీహెచ్ ప్రశ్నించారు.
అసలు కేవీపీ ఏమన్నారంటే.. తెలంగాణలో కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నారు. అయితే తాను దశాబ్దాలుగా హైదరాబాదులోనే ఉంటున్నట్టు గుర్తు చేశారు. నన్ను కూడా తెలంగాణలో కలుపుకోండి అంటూ అక్కడున్న తెలంగాణ నాయకులను కేవీపీ కోరారు. కనీసం మొత్తం తెలంగాణ వాడిగా కలుపుకోకపోయినా సగం తెలంగాణ వాడిగా అయిన తనని చూడాలంటూ అక్కడ నవ్వులు పూయించారు. తన మరణం తర్వాత ఈ తెలంగాణ మట్టిలోనే కలిసిపోతానని కేవీపీ చెప్పుకొచ్చారు.
అలా తాను తెలంగాణకు చెందిన వాడినేనని.. తనను ఆంధ్రా వాడు అనుకోవద్దని, తన ఓటు కూడా తెలంగాణలోనే ఉందన్నారు. ఈ కామెంట్స్పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు వద్దామనుకునే ఆలోచనను కేవీపీ రామచంద్రరావు మానుకోవాలని వీహెచ్ సూచించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విభజన వద్దని ప్లకార్డులు పట్టుకున్నప్పుడు కేవీపీకి తెలంగాణ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని.. కాబట్టి కేవీపీ ఏపీ వెళ్లి పని చేస్తే బెటర్ అని సూచించారు.