స్వతంత్ర వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లోని మిశ్రమ సంకేతాలతో ఆరంభంలో ఫ్లాట్ గా మొదలైన కాసేపాటికే లాభాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్ 83 పాయింట్ల లాభంతో 62,929 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్ల లాభంతో 18,627 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఐదు పైసలు పుంజుకొని 82.68 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్సీఎల్ టెక్, ఐటీసీ, టైటన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్యూఎల్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, పవర్గ్రిడ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నెస్లే ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, టాటా స్టీల్, టీసీఎస్, ఎంఅండ్ఎం, సన్ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
దేశీయంగా చూస్తే పలు మార్గదర్శకాలను జారీ చేస్తున్నప్పటికీ.. ఇప్పటికీ కొన్ని బ్యాంకులు కార్పొరేట్ పాలనాపరంగా బలహీనంగా ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ హెచ్చరించారు. ఈ ధోరణి మారకపోతే.. బ్యాంకింగ్ రంగం ఊగిసలాటకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. బ్రెంట్ బ్యారెల్ చమురు ధర స్వల్పంగా పెరిగి 77.61 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం రూ.1,758.16 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు సైతం రూ.853.57 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.