దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో రెండు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విశాఖపట్నం- సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ నడుస్తుండగా.. ఇవాళ ఇదే మార్గంలో మరొకటి పట్టాలు ఎక్కనుంది. దీంతోపాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి-బెంగళూరు వందేభారత్ రైలు, కొళ్లం-తిరుపతి మెయిల్ ఎక్స్ప్రెస్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ వర్చువల్గా ప్రారంభించనున్నారు. వీటితోపాటు పలు మార్గాల్లో రెండో లైను, మూడో లైను, గేజు మార్పిడి, బైపాస్ లైన్లు, పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లు, గూడ్స్ షెడ్లు.. ఇలా దేశం మొత్తమ్మీద 85 వేల కోట్ల విలువైన పలు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, మరికొన్నింటిని జాతికి అంకితం చేయనున్నారు.
దక్షిణమధ్య రైల్వే పరిధిలో 9 పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లు, 11 గూడ్స్ షెడ్లు, రెండు జన ఔషధి కేంద్రాలు, 3 రైల్వే కోచ్ రెస్టారెంట్లను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. 14 మార్గాల్లో రైల్వే లైన్ల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ కింద దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని స్టేషన్లలో చేతి వృత్తుల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు 193 ప్రారంభం కానున్నాయి. ఈ జాబితాలో తెలంగాణ పరిధిలో 55, ఏపీలో 111, మహారాష్ట్రలో 27 దుకాణాలున్నాయి.