శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలంలో నివాసం ఉంటున్న బెంతో ఒరియాలు పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు చేపట్టారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సుమారు 25 వేల మంది నివాసం ఉంటున్నామని వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుంచీ తాము ఏపీలోనే ఉంటున్నామని చెప్పారు. 1983 నుంచి 2003 వరకు తమకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీచేసేవారని బెంతో ఒరియాలు గుర్తుచేశారు.
2003లో తమకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా రెవెన్యూ సిబ్బంది ఆపివేశారని బెంతో ఒరియాలు వాపో యారు. అప్పటి నుండి తాము పోరాటం చేస్తూనే ఉన్నామని చెప్పారు. కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని బెంతో ఒరి యాలు డిమాండ్ చేశారు. లేదంటే విద్య, ఉద్యోగావకాశాలు తమకు దూరం అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు తాను అధికారంలోకి వస్తే ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీచేస్తానని హామీ ఇచ్చారని బెంతో ఒరియాలు తెలిపారు. కానీ.. జగన్ అధికార పీఠం ఎక్కి ఐదేళ్లు కావస్తున్నా ఎలాంటి ప్రయోజ నం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ను కలిసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అనుమతి దొరకడం లేదని విచారం వ్యక్తం చేశారు.స్థానిక మంత్రి తమకు కులధ్రువీకరణ పత్రం రాకుండా అడ్డుకుం టున్నారని బెంతో ఒరియాలు ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులు హామీలు ఇచ్చినప్పటికీ తమ కోరిక నెరవేరడం లేదన్నారు. ఉన్నత చదువులు చదవాలన్నా.. ఉద్యోగం చేయాలన్నా తమకు స్తోమత లేదని, పేదరికం అడ్డు వస్తోందని బెంతో ఒరియాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోతే తాము జీవితాంతం కూలీలుగానే మిగిలిపోవాల్సి వస్తుందని బెంతో ఒరియా యువకులు వాపోయారు.
స్థానిక రాజకీయ నాయకులు తమను ఒక ఓటర్లుగానే చూస్తున్నారు కానీ తమను ప్రజలుగా గుర్తించడం లేదని బెంతో ఒరియాలు ఆవేదన చెందుతున్నారు. దీంతో పాటు తాము నిజమైన బెంతో ఒరియాలు కాదని ఒక పక్క గిరిజన మిత్రులు తమపై పోరాటం చేస్తున్నారని చెప్పారు.ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు తమకు జారీ చేయకపోతే స్థానిక అధికా ర పార్టీ నేతలకు ఓటమి రుచి చూపిస్తామని బెంతో ఒరియాలు హెచ్చరించారు. తమ కోరిక తీరకుండా అడ్డుపడొద్దని మంత్రి అప్పలరాజుకి వారు విజ్ఞప్తి చేశారు. తమకు కుల ధ్రువీకరణ పత్రం ఇప్పించాలన్నారు. లేదంటే అప్పలరాజును ఓడించాలని నియోజకవర్గం ప్రజలకు వివరిస్తామన్నారు.బెంతో ఒరియా కులస్తులు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా కొనసాగుతున్నారని నిరసనకారులు తెలిపారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని బెంతో ఒరియా ఆందోళనకారులు స్వతంత్ర టీవీని ఆశ్రయించారు. ఆధార్ కార్డులో ఎస్టీ అని ఉంటుందని, అయితే.. ధ్రువీకరణ పత్రం ఇచ్చేటప్పుడు స్టార్లు దర్శనమిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికైనా సీఎం జగన్మోహన్రెడ్డి 2019లో ఇచ్చిన హామీ నెరవేర్చి, తమకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని బెంతో ఒరియాలు విజ్ఞప్తి చేశారు.