ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అయితే అక్కడ చేరిన బురద, నీరు సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్నా ఎస్ఎల్బీసీని పట్టించుకోని బీఆర్ఎస్.. మాత్రం ఈ ఘటనపై విమర్శలు చేసేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు.
SLBCటన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది ఆచూకీ తెలియని ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగితేలడం దిగజారుడు రాజకీయమేనని ఆయన ఆరోపణలు చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రికే జరిగిన ఘోర దుర్ఘటనపై సీరియస్ నెస్ లేకపోతే, ఇక అధికార యంత్రాంగానికి ఎక్కడ ఉంటది ? రెస్క్యూ ఆపరేషన్ ఎలా ముందుకు సాగుతది ?? అంటూ ప్రశ్నించారు. ఓట్ల వేటలో జిల్లాలకు జిల్లాలు చుట్టి వచ్చేందుకు ముఖ్యమంత్రికి సమయం ఉంది కానీ.. ఒక్కసారి క్షతగాత్రుల ఆర్తనాదాలతో మిన్నంటుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ కు వెళ్లే టైమ్ లేదా ? అంటూ రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు.
ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా ? ప్రజాపాలన అంటే నోట్ల వేట.. ఓట్ల వేట మాత్రమేనా ? అంటూ ధ్వజమెత్తారాయన. ఓవైపు సహాయక చర్యలు కొలిక్కి రాకముందే, ఇరుక్కున వారు బతికుండే అవకాశం కనిపించడం లేదని సర్కారు చేతులెత్తేస్తున్న తీరు, మరోవైపు సహాయక చర్యలను పర్యవేక్షించి, బాధితుల కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మరిచి ఎన్నికలే మా తొలి ఎజెండా అనే ముఖ్యమంత్రి !!! సర్కారుకు కనీస మానవత్వం కూడా లేదా ? అంటూ విమర్శించారు.
రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు, ఎనిమిది మందిని బలిపీఠం ఎక్కించి గ్రాడ్యూయేట్స్ కు గాలం వేసేందుకు సిద్ధమైన సీఎంను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని… సరైన సమయంలో కాంగ్రెస్ కు కర్రగాల్చి వాత పెడ్తారని కేటీఆర్ ఆరోపించారు.