ప్రచారం పర్వం ముగియడంతో పోల్ మేనేజ్మెంట్పై ఫోకస్ పెట్టాయి రాజకీయ పార్టీలు. క్షేత్రస్థాయిలో ఓటర్ నాడీ తెలుసుకోవడం, అసంతృప్తిగా ఉన్న వారిని తమవైపుకి తిప్పుకోవడం పోల్ మేనేజ్మెంట్ ప్రక్రియలో ప్రధాన పాత్ర. ఇక్కడ విఫలమైతే ఫలితాలు తారుమారే. అందుకే పోలింగ్కు ముందు మిగిలి ఉన్న ఈ కాస్త సమయంలో పోల్ మేనేజ్మెంట్ పార్టీలన్నింటికీ అత్యంత కీలకం. మరి పోల్ మేనేజ్ మెంట్ ఎలా చేస్తారు..? పార్టీల వ్యూహాలేంటి..?
ఎన్నికల సమరంలో పోల్ మేనేజ్మెంట్ అత్యంత కీలకం. అందుకే ఓ వైపు ప్రచారంలో దూసుకెళ్తూనే పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించిన నేతలు ఇప్పుడు ప్రచార పర్వం ముగియడంతో ఫోకస్ అంతా పోల్మేనేజ్పైనే పెట్టారు. ఎందుకంటే, ఇక్కడ కానీ విఫలమైతే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఈ పనిలోనే మునిగిపోయాయి. అయితే, ఈ ప్రక్రియ కోసం పార్టీ నేతలు ఒక్కో స్ట్రాటజీని ఫాలో అవుతారు. ఓటర్లను ఏ,బీ,సీ అని మూడు వర్గాలుగా విభజించి ఓటర్లు ఎవరి వైపు ఉన్నారన్న అంచనాకు వస్తుంటారు. పార్టీ నేతల కుటుంబాలు, వారి బంధువులు, సన్నిహితులు, అలాగే పార్టీ సానుభూతిపరులు, పార్టీ మద్దుదారులను ఏ కేటగిరిలో లెక్కిస్తారు. ఇక ఏ పార్టీకి సంబంధం లేని తటస్థ ఓటర్లను బీ కేటగిరిలో లెక్కిస్తారు. వీరికి రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం ఉండదు. అయితే, వీళ్ళ ఓట్లే చాలా కీలకం. వీళ్ళు పార్టీకి ఓటేస్తే ఆ పార్టీదే విజయం. అదే విధంగా అధికార పార్టీపై వ్యతిరేకతతో ఉన్నవారు సి కేటగిరిలో ఉంటారు. ఇందులో ఇతర పార్టీల మద్దతుదారులు, పార్టీ తీరు లేదా స్థానిక నేతల వల్ల అసంతృప్తితో వ్యతిరేకంగా ఉన్నవారు ఉంటారు.
ఇక ఏ కేటిగిరి ఓటర్లపై పూర్తి భరోసాతో ఉన్న నేతలు.. బీ, సీ కేటగిరిలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. వీరి అసంతృప్తికి, వ్యతిరేకతకు కారణాలేంటో తెలుసుకుని.. వారిని తమ వైపుకి తిప్పుకునే వ్యూహంలో ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ వర్గాల వారిని రెండుమూడు విడతలుగా కలవటం ద్వారా తటస్ధ ఓటర్లు, ప్రత్యర్ధి పార్టీలకు చెందిన ఓటర్లను కూడా తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలుంటాయన్న భావనలో ఉంటారు. ఇక ఎన్నికల రణరంగంలో ఒక్క ఓటు కూడా కీలకమే. ఈ నేపథ్యంలోనే బూత్ల వారీగా ఇన్చార్జిలను, కో ఇన్చార్జిలను నియమించుకుని.. వారితో నిత్యం టచ్లో ఉండేలా ఏర్పాట్లను చేస్తుంటారు పార్టీ నేతలు. గ్రౌండ్లోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ.. ఓటర్లంతా తమకు ఓటు వేసేలా బూత్ ఇన్చార్జీలకు దిశానిర్దేశం చేస్తారు. బూత్ కమిటీ ఇన్చార్జిలు, సభ్యులు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించే చర్యలు చేపడతారు. దూర ప్రాంతాల్లో ఉన్న వారితో కూడా క్షేత్రస్థాయిలోని నేతలు సంప్రందింపులు జరుపుతారు.
ప్రచారం పర్వం ముగియగానే నేతలు పోల్మేనేజ్మెంట్పైనే దృష్టి సారిస్తారు. కేవలం గంటల కొద్దీ సమయం మిగిలి ఉండటంతో ఓటర్లను తమ వైపుకి తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తారు. గంప గుత్తగా ఓట్లు రాబట్టుకునేందుకు. కుల, వృత్తి, యువజన సంఘాలు, అసోసియేషన్లు, కార్మిక సంఘాలు, ఇతర సంఘాల వారీగా విందు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. డబ్బు, ముక్క, చుక్క ఆశ చూపి ఓటు తమకు పడేలా ఎత్తులు వేస్తారు. ఇందుకోసం నమ్మకస్తులైన వారిని ఎంచుకుంటారు. అభ్యర్థి టికెట్ దక్కించుకోవడం, ప్రచారం చేయడం ఒక ఎత్తు అయితే, ప్రచారం ముగిసిన తర్వాత ఓటర్లును పోలరైజ్ చేసి.. తమకు ఓటు వేసే విధంగా చేయడం మరో ఎత్తు. అందుకే మిగిలిన కొద్ది సమయంలో పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారిస్తారు. విజయం దిశగా వ్యూహాత్మకంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమకే ఓటు వేసేలా ఎత్తులు వేస్తారు.