పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాలో పాట పాడి అందరికీ సుపరిచితులు అయిన పద్మశ్రీ కిన్నెర మొగిలయ్య తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కష్టాల గురించి చెప్పుకున్నారు. ఆ ఇంటర్వ్యూ హోస్ట్ చేసిన యాంకర్ శివ మాధవ్.. మొగిలయ్య కష్టాలను డైరెక్టర్ సుకు పూర్వజ్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నుంచి పెన్షన్ ఆగిపోవడంతో మొగిలయ్య పరిస్థితి దయనీయంగా మారిందన్న విషయం తెలుసుకుని సుకు పూర్వజ్-జ్యోతి పూర్వజ్ దంపతులు చలించిపోయారు.
విషయం తెలుసుకున్న వెంటనే మొగిలయ్యను తమ నివాసానికి భోజనానికి ఆహ్వానించారు. ‘గుప్పెడంత మనసు’ సీరియల్తో ఎంతో పాపులర్ అయి, ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్తో దూసుకుపోతున్న నటి జ్యోతి పూర్వజ్.. తను ప్రతియేటా అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనే ఆనవాయితీని పక్కకు పెట్టారు. ఆ డబ్బును మొగిలయ్యకు అందించి తన గొప్ప మనసును చాటుకున్నారు.
ప్రస్తుతం తాను కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, కానీ తన ఇబ్బందుల కంటే మొగిలయ్య పరిస్థితి ఎక్కువగా కలచివేసిందని ఆమె తెలిపారు. ఆయన ప్రతిభకు తను ఇస్తున్న డబ్బు పెద్ద సాయం కూడా కాదని ఆమె అభిప్రాయపడ్డారు. అనంతరం మొగలయ్య పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. మొగిలయ్యకు సాయం చేసేందుకు మరికొందరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆమె అభిమానులతో పాటు నెటిజన్లు కూడా జ్యోతిరాయ్ మంచి మనుసును మెచ్చుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక డైరెక్టర్ సుకు పూర్వజ్ కూడా మొగిలయ్య ప్రతిభకు దాసోహం అయ్యారు. తను దర్శకత్వం వహించబోయే సినిమాల్లో మొగిలయ్యను భాగస్వామి చేసి ఆయనకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. మొగిలయ్యకు ఏదైనా పాత్ర ఇవ్వడం లేదా ఆయనతో పాటలు రాయించడం, పాడించడం చేస్తానని చెప్పారు.
తెలంగాణకు చెందిన కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డు ప్రదానం చేసిన విషయం తెలిసిందే. అవార్డు తర్వాత తెలంగాణ ప్రభుత్వం మొగిలయ్యకు పెన్షన్ పంపిణీ చేసింది. అయితే తాజాగా ప్రభుత్వం మారడంతో పెన్షన్ ఆగిపోయింది. దీంతో కొద్దిరోజుల నుంచి కూలీ పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు.