కరోనా విపత్కర పరిస్థితుల్లో సంజీవనిగా మారిన టీకాలు. సైడ్ ఎఫెక్ట్లతో ప్రాణాలను బలి తీసుకుంటున్న ఆరోపణ లతో ఆస్ట్రాజెనికా కోవీషీల్డ్ వ్యాక్సిన్ తయారీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ను మార్కెట్ నుంచి వెనక్కు రప్పిస్తోంది. ఇప్పటికే ఉత్పత్తిని నిలిపివేయ డంతోపాటు డిస్ట్రిబ్యూషన్ కూడా ఆపేసినట్లు తెలిపింది. మరి ఆస్ట్రాజెనికా కీలక నిర్ణయం వెనుక కారణాలేంటి..?
కరోనా నాటి పరిస్థితులను ఎవరూ మర్చిపోలేరు. ప్రపంచాన్నే వణికించిన ఆ మహమ్మారి విలయ తాండవంతో యావత్ విశ్వమే స్థంభించిపోయింది. ఆనాటి కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో సంజీవనిగా మారాయి కరోనా వ్యాక్సిన్లు. పక్కా ప్రణాళి కలు వేసుకుని మరీ ప్రపంచ వ్యాప్తంగా అందరికీ టీకాలు వేయించాయి అక్కడి ప్రభుత్వాలు. 2020లో ప్రపంచాన్ని హడలెత్తించి దాదాపు మూడేళ్లపాటు జనాలను వణికించిన ఈ మహమ్మారి ఆ తర్వాత తోక ముడిచింది. సాధారణ జబ్బుగా మారిపోయింది. దీంతో కోవిడ్ భయం జనాల్లో మాయమైంది. అయితే, మళ్లీ జనం మంచాన పట్టడమే కాదు. ఏకంగా మృత్యు ఒడిలోకి వెళ్లే పరిస్థితి రావడంతో కోవిడ్ టీకాల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కోవిడ్కు విరుగుడుగా తీసుకున్న కోవిషీల్డ్ టీకా సైడ్ ఎఫెక్ట్స్ పెరిగాయని జనం గగ్గోలు పెడుతున్నారు. రక్తం కడ్డకట్టడం, వైట్ ప్లేట్ లెట్స్ సంఖ్య పడిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయన్న వార్తలు వైరల్గా మారడంతో ప్రజలు మళ్లీ హడలెత్తిపోతున్నారు. గతకొన్ని రోజులుగా దీని వినియోగంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం కావడం, సుప్రీంకోర్టు సహా వివిధ దేశాల న్యాయస్థానాల్లో కేసులు నమోదు వంటి పరిణామాలతో ఈ వ్యాక్సిన్ అమ్మకాలపై కోవీషీల్డ్ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా కీలక నిర్ణయం తీసుకుంది. తాము ఉత్పత్తి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్లను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్ లో అప్ డేటెడ్ టీకాలు అధిక సంఖ్యలో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తమ వ్యాక్సిన్ వ్యాక్స్ జెవ్రియాకు గిరాకీ తగ్గిందని అంగీకరించింది. అయితే కేసుల నమోదుతో ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ పై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతోంది. ఇప్పటికే దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తినట్లు పలువురు న్యాయ స్థానాలను ఆశ్రయించారు. దీనిపై వివరణ ఇచ్చిన ఆస్ట్రాజెనెకా తమ వ్యాక్సిన్ వల్ల చాలా అరుదు గా సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చని తెలిపింది.
దేశంలో ఓ న్యాయవాది ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ రిస్క్లపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ టీకా వాడకంలో చాలా రిస్క్ ఉన్నాయని, వాటిని వైద్య నిపుణుల చేత అధ్యయనం చేయించాలని న్యాయ వాది విశాల్ తివారీ తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా.. కోవిడ్ 19 సమయంలో టీకా డ్రైవ్ ఫలితంగా నష్టపోయిన ప్రజలకు నష్ట పరిహారం కూడా చెల్లించే విధానాన్ని అమలు చేయాలని కోరారు. మన దేశంలో కోవిడ్ మహమ్మారి సమయంలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఫార్ములాను పుణెకు చెందిన సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లైసెన్స్ పొందిందని, అయితే ఈ వ్యాక్సిన్తో రక్తం గడ్డ కట్టడానికి సంబంధిచిన దుష్ప్రభావం కలిగే అవకాశం ఉందని తివారీ తన పిటిషన్లో కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన సాక్షాలను కూడా కోర్టుకు సమర్పించారు. ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనికా తన కోవిడ్ 19 వ్యాక్సిన్ థ్రోంబో సైటోపెనియా సిండ్రోమ్ ఐటిటిఎస్తో థ్రాంబోసిస్ కారణమవుతుందని అంగీకరించిన యూకే కోర్టు పత్రాలను పిటిషన్తో జతపరిచారు. అయితే కోవిడ్ 19 తర్వాత ప్రజల్లో గుండెపోటు ఎక్కువైందని.. ముఖ్యంగా యువకుల్లో గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయని తివారి తన పిటిషన్లో తెలిపారు. దేశవ్యాప్తంగా 175 కోట్లకు పైగా జనం కోవిషీల్డ్ వాక్సిన్ను తీసుకున్నారని.. దీని కారణంగా ప్లేట్ లెట్స్ పడిపోవడం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన వివరించారు. దేశ ప్రజలు ఆరోగ్యం, భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.