ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్పై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల విరుచుకుపడ్డారు. సూపర్ సిక్స్ పేరుతో సీఎం చంద్రబాబు మహిళలను మోసం చేశారని ఆరోపించారు. చేతగానప్పుడు, చేయలేనప్పుడు వాగ్ధానాలు చేయకూడదని అన్నారు. చంద్రబాబు మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి అలాగే మోసం చేశారన్నారు.
సూపర్ సిక్స్ పేరుతో బాండు పేపర్లు ఇచ్చి నిలువునా మోసం చేశారని శ్యామల దుయ్యబట్టారు. మహిళలను మోసం చేసినందుకు చంద్రబాబుపై 420 కేసు పెట్టవచ్చన్నారు. 2014లో కూడా డ్వాక్రా రుణమాఫీ పేరుతో మోసం చేశారని.. నమ్ముతున్నారని మహిళలను సులువుగా మోసం చేస్తున్నారని విరుచుకుపడ్డారామె. తల్లికివందనం పేరుతో జగన్ ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని ఆపేశారని చెప్పారు.
లక్చలాది మంది తల్లులు, విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. రాసి పెట్టుకోమని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు సమాధానం చెప్పకుండా తిరుగుతున్నారు. హామీలు మాత్రం జనంలో ఇచ్చారు. ఇవ్వలేకపోతున్నామని నాలుగు గోడల మధ్య ఎందుకు చెప్తున్నారు?. తల్లికి వందనం ఇవ్వట్లేదని టీడీపీ నేతలు జనంలోకి వచ్చి చెప్పాలి.
దీపం పథకం కింద ఇవ్వాల్సిన రూ.4,115 కోట్లు ఎగ్గొట్టారు. కనీసం ఉచిత బస్సు పథకాన్ని కూడా ఎందుకు అమలు చేయటం లేదు?. 2025 జనవరి 1న జాబ్ కేలండర్ ఇస్తామని లోకేష్ ప్రకటించారు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో అనేది పక్కన పెడితే.. కనీసం జాబ్ కేలండర్ కూడా ఎప్పుడు ప్రకటిస్తారో తెలియటం లేదు. పండుగ హామీలు లేవు, పెళ్లిళ్ల కానుకలూ లేవు. సంపద సృష్టి అంటే ప్రజలకేమో అనుకున్నాం.. చంద్రబాబు సొంతంగా సృష్టించుకోవటం అని ఇప్పుడే తెలిసింది. రూ.74 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని లెక్క తెలిసినా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు డబ్బుల్లేవని ఎలా చెప్తారు? . ఈ హామీల అమలుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని శ్యామల అన్నారు.