హైదరాబాద్ శివారు హయత్నగర్ (Hayathnagar) పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొహెడ గ్రామానికి చెందిన గోవర్ధన్ అనే యువకుడు కుటుంబ కలహాలు, భార్య మోసం చేశిందన్న మనస్థాపంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గోవర్ధన్ నాలుగేళ్ల క్రితం ఇంట్లో వారికి తెలియకుండా సరిత గౌడ్ అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఓ బాబు కూడా జన్మించాడు. అయితే ఇటీవల సరిత గౌడ్ మరో వ్యక్తిని వివాహం చేసుకుందని, తమ బాబును కూడా ఇతరులకు అప్పగించిందని గోవర్ధన్కు తెలిసింది.
ఈ విషయాన్ని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన గోవర్ధన్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటన మంగళవారం జరిగినప్పటికీ, పూర్తి వివరాలు తాజాగా బయటకు వచ్చాయి.
గోవర్ధన్ తల్లి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తూ, తమ మనవడు ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని, బాబును తమకు అప్పగించాలని వేడుకుంది. అలాగే తన కుమారుడి మొబైల్ ఫోన్లో వీడియోలు, ఫోటోలు, వాయిస్ రికార్డులు ఉన్నాయని, వాటిలో నిజాలు బయటపడతాయని పేర్కొంది.
కుటుంబ సభ్యులు పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటివరకు సరిత గౌడ్ను అరెస్టు చేయలేదని ఆరోపిస్తున్నారు. గోవర్ధన్ ఫోన్లో సూసైడ్ నోట్తో పాటు పలు కీలక ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఈ ఘటనపై స్పందించిన నాగరాజు గౌడ్ మాట్లాడుతూ, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. గోవర్ధన్ ఫోన్ నుంచి ఫోటోలు, వీడియోలు, రికార్డులు, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సరిత గౌడ్ పూర్తి వివరాలు ఇంకా నిర్ధారించాల్సి ఉందని, చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యాక తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


