ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) ఊరటనిచ్చే వార్త చెప్పింది. దేశానికి అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాలు ఈసారి సాధారణం కంటే ముందుగానే కేరళ తీరాన్ని తాకనున్నాయని వెల్లడించింది.
సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయి. అయితే ఈసారి మే 26నే కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ శుక్రవారం ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా వర్షాలు కూడా ముందుగానే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
భారత వ్యవసాయ రంగానికి నైరుతి రుతుపవనాలు జీవనాడిగా భావిస్తారు. దేశంలోని 50 శాతానికి పైగా సాగుభూమి ఇప్పటికీ వర్షాధారంగానే సాగు జరుగుతోంది. మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో దాదాపు 40 శాతం దిగుబడి ఈ వర్షాధార భూముల నుంచే వస్తోంది.
అందువల్ల నైరుతి రుతుపవనాల పురోగతి దేశ ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థపై కీలక ప్రభావం చూపుతుంది. ఈసారి ముందుగానే రుతుపవనాలు రావడం రైతులకు ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఖరీఫ్ పంటల సాగుకు ఇది అనుకూలంగా మారే అవకాశముంది.
వాతావరణ నిపుణులు కూడా ఈ ఏడాది సాధారణానికి మించి వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో వ్యవసాయ రంగంతో పాటు జలాశయాలు, భూగర్భ జలాల పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉందని చెబుతున్నారు.


