ఎన్నికల వేళ ప్రధాని మోడీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 30న ఆయన రాష్ట్రానికి రానున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో పర్యటించనున్న మోడీ.. ఆ నియోజకవర్గ పరిధిలోని జోగిపేట అల్లదుర్గ్లో బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు పలుమార్లు తెలంగాణలో పర్యటించిన ప్రధాని పలు అభివృద్ధి పనులు, పలు ప్రాజెక్టులు జాతికి అంకితం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ తెలంగాణకు వస్తుండటంతో ఈ సభను స్టేట్ బీజేపీ యూనిట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర నేతలకు పార్టీ నాయకత్వం బాధ్యతలు అప్పగిస్తోంది. డబుల్ డిజిట్ సీట్లే లక్ష్యంగా ప్రధాని మోడీ సభకు భారీగా జనసమీకరణ చేయాలని ప్లాన్ చేస్తోంది. కాగా, తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కమలం పార్టీ.. రాష్ట్రంలో డబుల్ డిజిట్ సీట్లలో గెలుపు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవడంతో పాటు కొత్త స్థానాల్లో కాషాయ జెండా పాతాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్రనేతలను రాష్ట్రానికి రప్పించి ప్రచారం చేయిస్తుంది. మొదటి దశలో భాగంగా ఇప్పటికే తెలంగాణలో మోడీ, అమిత్ షా, నడ్డా, రాజ్ నాథ్ సింగ్ వంటి టాప్ లీడర్స్ ప్రచారం నిర్వహించారు.


