ఇందూరు ఇలాఖాలో పార్లమెంట్ ఎన్నికల వేడి సెగలు కక్కుతోంది. ప్రధాన పార్టీ అభ్యర్థులు నువ్వా నేనా అంటూ కాలుదువ్వుతుంటే నిజామాబాద్ రాజకీయం రంజుగా సాగుతోంది. ఎన్నికల రణరంగంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు తగ్గేదేలే అంటూ ప్రచార హోరులో దూకుడు పెంచడంతో పొలిటికల్ హీట్ మరింత కాక రేపుతోంది. ఇంతకీ ఇందూరు గడ్డ మీద ఎవరి గాలి వీస్తోంది..? ఏ నేతకు పట్టం కట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారు..? త్రిముఖ పోరులో ఎవరి వ్యూహం ఫలిస్తుంది..?
నిజామాబాద్ జిల్లాలో లోక్సభ ఎన్నికలు కాకపుట్టిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా దూకుడు పెంచిన ప్రధాన పార్టీ నేతలు.. విమర్శలు, ప్రతివిమర్శలతో రెచ్చిపోతున్నారు. ఇందూరు పార్లమెంట్ గడ్డపై తమ జెండా ఎగురవేసి… ప్రత్యర్థులను మట్టికరిపించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పావులు కదుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లకు తావివ్వకుండా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్రెడ్డిని ప్రకటించడంతో ఎన్నికల వేడి మరింత రాజుకుంది. ముగ్గురు బలమైన నేతలనే బరిలో దించాయి పార్టీలు. దీంతో పదునైన అస్త్రశస్త్రాలన్నీ ప్రయోగించి.. విజయం దిశగా పకడ్బందీ వ్యూహాలకు పదునుపెడుతున్నారు బరిలో నిలిచిన రేసు గుర్రాలు. తమ బలగాన్ని పటిష్టం చేసుకునే క్రమంలో ఎప్పటికప్పుడు ముఖ్య నేతలతో సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక తమ కార్యకర్తల్లో ఉత్తేజం, ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంలో మూడు పార్టీలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. కుల సంఘాలు, వ్యాపార వేత్తలు, మేధావులు, ముఖ్య వ్యక్తులను కలుస్తూ అంతర్గత ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ బరిలో దిగిన ముగ్గురూ బలమైన అభ్యర్థులు కావడంతో ఎవరి ధీమాలో వారు ఉన్నారు. మరోసారి బీజేపీ నుంచి పోటీకి సై అంటున్న అరవింద్ విమర్శలు ఎంత ఘాటుగా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. పదునైన మాటలతో, వ్యంగ్యాస్త్రాలను సంధిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపడం లో ఆయన స్టైలే వేరు. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ కవితను ఓడించి తన బలాన్ని చాటిన అరవింద్ మరోసారి అదే వ్యూహంలో ఉన్నారు. మరోపక్క బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్కు మాస్ లీడర్గా పేరుంది. ఆయన కూడా విమర్శలు విసరడంలో తక్కువేం కాదు. తన పంచ్ డైలాగులతో కాక పుట్టిస్తారు. రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలుగా తనదైన ముద్ర వేసుకున్న బాజిరెడ్డి స్పీచ్ మాస్గా ఉంటుంది. ప్రత్యర్థులను ఇరుకున పెట్టేలా తన మాటల తూటాలతో ఉక్కిరి బిక్కిరి చేయడంలో ఆయనకు ఆయనే సాటి. అయితే,… బాజిరెడ్డి ఇప్పటివరకు కేవలం అసెంబ్లీకి మాత్రమే పోటీ చేశారు. తొలిసారిగా కేసీఆర్ ఆదేశాల మేరకు పార్లమెంట్ బరిలో సై అంటున్నారు. ఇటు కాంగ్రెస్ అభ్యర్థిగా అత్యంత సీనియర్ నాయకుడైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బరిలో నిలిచారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ గా పనిచేసిన అపార అనుభవం ఆయనకు ఉంది. గతంలో ఒకసారి కరీంనగర్ పార్లమెంటుకు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై మంత్రి ఛాన్స్ను మిస్ చేసుకు న్నారు. ఇక జీవన్రెడ్డి స్పీచ్ కూడా అద్భుతంగా ఉంటుంది. మేధావి వర్గాన్ని ఆకట్టుకునే రీతిలో ఆయన స్పీచ్ కొనసాగుతుంది. కార్యకర్తలను, నాయకులను ఆలోచనతో కట్టిపడేసేలా ఆయన మాటల తూటాలు పేలుస్తారు. వివాదాలకు తావు లేకుండా విమర్శలు చేయడం జీవన్రెడ్డి రూటే సపరేటు అన్నట్టుగా ఉంటుంది. ముగ్గురు రాజకీయ ఉద్దండులు కావడంతో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే,.. ముగ్గురు అభ్యర్థులు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం కొసమెరుపు.
పార్లమెంట్ ఎన్నికల సందడి మొదలుకావడంతోనే వలసల జోరు పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ నుంచి హస్తం గూటికి నేతలు క్యూకట్టారు. మరికొందరు బీజేపీ శిబిరానికి చేరిపో యారు. దీంతో ఎన్నికల వేళ గులాబీ పార్టీకి వలసలు ఇబ్బందిగా మారాయి. బీఆర్ఎస్ను పూర్తిగా బలహీనపరచాలని భావిస్తున్న కాంగ్రెస్, బీజేపీ ఆకర్ష్ మంత్ర ప్రయోగించింది. దీంతో నిజామాబాద్ పార్ల మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నుంచి వలసలు సందడి జోరందుకుంది. అదే పనిగా నిత్యం పార్టీలు మారడం వారి పనైపోయింది. ఇలాంటి పరిణామాల మధ్య బీఆర్ఎస్ మాత్రం తమకేం నష్టం లేదంటోంది. కార్యకర్తలపై భరాసాతో ఉంది. అందుకే కార్యకర్తలు చేజారకుండా ఉండేందుకు బిఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.