సింహం సింగిల్ గా వస్తుంది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు పదేపదే చెప్పే మాట ఇది. అవును.. అక్షరాల జగన్మోహన్ రెడ్డి సింగిల్గానే వెళ్తున్నారు. ఎన్నికల ప్రచార బాధ్యతలను ఒంటరిగా తన భుజస్కంధాలపై మోస్తున్నారు. ఓ వైపు ప్రతిపక్షాలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నా జగన్ మాత్రం ఒంటరి గానే వారందరికీ సమాధానం చెబుతున్నారు. 175 అసెంబ్లీ స్థానాలు 25 పార్లమెంటు స్థానాలను గెలిపించే బాధ్యతను తానే తీసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు జగన్. వైసిపికి ఆయనే స్టార్ క్యాంపెయినర్ గా మారారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచార జోరు ఊపందుకుంది. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు రాజకీయ ప్రత్యర్థుల వాడి వేడి మాటలతో ఏపీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. రానున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవైపు వైసీపీ, మరో వైపు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి డైరెక్ట్ ఫైట్.. జరిగే అవకాశం ఉంది. దీంతో గెలుపు కోసం అన్ని పార్టీలు అస్త్ర శాస్త్రాలను సిద్ధం చేసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
ఎన్నికల్లో ప్రచారంలో ప్రతిపక్ష పార్టీలకంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో రెండు అడుగులు ముందే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా వైసీపీని గెలిపించే బాధ్యతను సీఎం జగన్ పూర్తిగా తన భుజస్కంధాలపై వేసుకుని దూసుకెళ్తున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ కి తోడుగా సోదరి షర్మిల, తల్లి విజయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం జగన్ ఒక్కరే ముమ్మర ప్రచారం చేస్తున్నారు. వైసీపీ అధినేతగా, మాస్ లీడర్ గా జగన్ కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాలన తర్వాత కూడా జగన్ కు ప్రజల్లో ఏమాత్రం ఆదరణ తగ్గలేదు. ఆయన చేస్తున్న బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు 25 పార్లమెంట్ స్థానాలను ఒంటి చేత్తో గెలిపించేలా ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారం కొనసాగు తోంది. వైసీపీలో జగన్ తప్ప, ఆ స్థాయిలో జనాకర్షక గల నాయకులే లేరు, దీంతో రెండోసారి పార్టీని గెలిపించే బాధ్యత తానే తీసుకున్నారు సీఎం జగన్.
వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి, జనసేన బిజెపి పొత్తు పెట్టుకున్నాయి. మూడు పార్టీలు ఏకమై అధికార వైసీపీని ఎదుర్కోబోతున్నాయి. టిడిపి తరఫున ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. జనసేన తరపున ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం మొదలుపెట్టారు. బిజెపిలో దేశంలోనే జనాకర్షణ నేత ప్రధాని మోదీ, అమిత్ షా లాంటి వారు ఉన్నారు. ఇప్పటికే చిలకలూరిపేట సభలో పాల్గొని ప్రధాని మోదీ…వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడంతోపాటు ఎన్డీఏ కూటమి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. రానున్న రోజుల్లో అనేక మంది కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్తోంది. దీంతో కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ లాంటి వారు ఏపిలో ఎన్నికల ప్రచారం నిర్వ హించే ఛాన్స్ వుంది. ప్రతి పక్షాలకు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నేతలు స్టార్ క్యాంపె యినర్లువున్నారు. కానీ వైసీపీ ఒకే స్టార్ క్యాంపెయినర్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. ఇన్ని పార్టీలు కలిసి వస్తున్నా. వైసీపీ అధినేత జగన్ మాత్రం ఎక్కడా ప్రచారంలో వెనకడుగు వేయడం లేదు. ప్రచారంలో దూసుకుపోతున్నారు.
వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం జగన్. గత ఎన్నికల్లో 151 సీట్లు వస్తే , ఈ సారి మొత్తం సీట్లు గెలవాల్సిందే అంటున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేశారు. మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు ఎవరికి వారు సొంత నియోజక వర్గాలకే పరిమితం అవుతున్న వేళ జగన్ మాత్రం అందరినీ గెలిపించే బాధ్యతను తానే తీసుకున్నారు. ఇప్పటికే సిద్దం పేరుతో నాలుగు భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ప్రస్తుతం మేము సిద్దం పేరుతో బస్ యాత్ర కొనసాగిస్తున్నారు. బస్ యాత్ర ముగిసిన తర్వాత మరోసారి ప్రజల వద్దకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే వ్యూహం సిద్ధమవుతోంది. ఎన్డీఏ కూటమిపై నిప్పులు చెరుగుతూ.. మొక్కవోని ధైర్యంతో జగన్ సాగిస్తున్న ప్రచారం పార్టీ శ్రేణులకు ఆశ్చర్యం కల్గిస్తోంది. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు మూకుమ్మడిగా జగన్ పై పోరాటం చేస్తున్నా…. అయన మాత్రం గెలుపు పై ధీమాగా ఎన్నికల ప్రచారం చేయడం విశేషం.