మండుటెండలో ఎన్నికల వేళ మందుబాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి. గత వారం రోజులుగా కోనసీమ జిల్లాలోని బార్లకు మందు సరఫరా కాకపోవడంతో మందుబాబులు అల్లాడుతున్నారు. మరోవైపు బార్ల యజమానులు లక్షలాది రూపాయల ఫీజులు కట్టినా సరుకు రాక బెంబేలెత్తున్నారు. ఇంతకీ అసలు కోనసీమ జిల్లాలో మద్యం ఎందుకు దొరకడం లేదు..?
ఓ వైపు ఎండలు..మరోవైపు ఉక్కపోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. అయితే ఎండ వేడితో పాటు కోనసీమ జిల్లాలో మందు బాబులకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయట. మండు వేసవిలో చల్లని బీర్లు దొరక్క మందు బాబులు తెగ ఇబ్బంది పడుతున్నారట. మరోవైపు గడచిన వారం రోజులుగా జిల్లాలోని ఏ బార్కు సక్రమంగా మద్యం సరఫరా కావడం లేదు. దీంతో వేసవి కాలంలో బీరు గ్లాసుల గలగలతో కిటకిటలాడాల్సిన బార్లు తలుపులు బార్ల తెరచుకున్నాయి. ఒక్క బీర్లే కాదు ఇతర మద్యం కూడా దొరకడం లేదు. వేసవి కాలం, ఎన్నికలు ఒకేసారి రావడంలో మద్యం వ్యాపారులు పండుగ చేసుకుం దామనుకున్నారు. అయితే గడచిన వారం రోజులుగా బార్ యజమానులు పెట్టిన ఇండెంట్కి సగంలో సగం కూడా మందు సరఫరా కావడం లేదని యాజమానులు అంటున్నారు. ముందు ప్రాధాన్యతగా మద్యాన్ని ప్రభుత్వ దుకాణాలకు ఇస్తున్నారని, వారికి పంపిన తర్వాతే తమకు మద్యం సరఫరా చేస్తు న్నారని వాపోతున్నారు.
మరోవైపు ప్రభుత్వ మద్యం దుకాణాలు మందుబాబులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ దుకాణాలు ఓపెన్ కాగానే మందు బాబులు క్యూలు కట్టి మరీ మందు తీసేసుకుం టున్నారు. దీంతో అక్కడికి వచ్చిన స్టాక్ కూడా వెంటనే అయిపోతోంది. షాపుల వద్ద మద్యం దొరకని వారు బార్లకు వచ్చి అక్కడ కూడా లేకపోవడంతో చిర్రుబుర్రులాడుతున్నారని బార్ సిబ్బంది అంటు న్నారు.అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా 150 వరకూ బార్లు ఉన్నాయి. ఇక్కడ ఒక్కో బార్ నుంచి రోజుకు కనీసం 60 కేసుల బీర్లు, 50 కేసుల ఇతరేతర మద్యం సరఫరా అవుతుందని ప్రాథమిక అంచనా. వేసవి కాలం కావడంతో పగలు బీర్ల అమ్మకాలు మరింత ఎక్కువుంటాయి. అయితే ప్రస్తుతం చాలా తక్కువ సరుకు మాత్రమే సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. అవి కూడా వచ్చిన గంటలోపే విక్రయాలు అయిపోతున్నాయట. దీంతో మందు బాబులు జిల్లాలో అన్ని బార్లకు తిరుగుతూ మద్యం కోసం పాట్లు పడుతున్నారు.
రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మద్యం అమ్మకాలపై టార్గెట్లు విధించేదని బార్ యజమానులు అంటున్నారు. అయితే ఎన్నికల సీజన్లో కూడా తమ ఇండెంట్కు సరిపడా సరుకు కూడా పంపడం లేదని వారంటున్నారు. సరుకంతా ప్రభుత్వ దుకాణాలకు వెళ్లిపోతే తమ వ్యాపారాలు ఎలా సాగుతాయని ప్రశ్నిస్తున్నారు. ఒక్కో బార్లోను వెయిటర్లు, క్యాషియర్లతో పాటు రెస్టారెంట్ సిబ్బందితో కలిపి కనీసం 150 మంది వరకూ పని వారు ఉంటారని, వారి జీతాలు, బార్ మెయింటెన్స్ ఎలా చేయాలని బార్ యజమానులు వాపోతున్నారు. మొత్తానికి మద్యం దొరకక మందు బాబులు, మద్యం అందుబాటులో లేక డీలా పడుతున్న బార్ యజమానులు మద్యం కావాలంటూ గగ్గోలు పెడు తున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాలి.


