ఉప్పల్ వేదికగా రాత్రి రాజస్థాన్తో జరిగిన ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. రాజస్థాన్ పై ఒక్క పరుగు తేడాతో గెలిచింది. 202 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్ల లో 200 పరుగులకే పరిమితమైంది. చివర్లో పొవెల్ రాజస్థాన్ను విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేసినప్పటికీ, చివరి బంతికి LBWగా ఔట్ కావడంతో పరాజయం తప్పలేదు. దీంతో రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ అర్థ శతకాలు వృథా అయ్యాయి. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీయగా, ప్యాట్ కమిన్స్, నటరాజన్ చెరో రెండు వికెట్లు పడ గొట్టారు.
అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. హైదరాబాద్ ఆటగాళ్లను ఆర్ఆర్ బౌలర్లు ఆది నుంచి కట్టడి చేశారు. పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి కేవలం 37 పరుగులు మాత్రమే చేసింది సన్రైజర్స్. తర్వాత ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ నుంచి ట్రావిస్ హెడ్ బ్యాట్ ఝుళిపించారు. అతనికి తెలుగు ఆటగాడు నితీశ్రెడ్డి జత కలిశాడు. దీంతో ఇద్దరూ కలిసి చెరో అర్థ శతకాలతో జట్టుకు భారీ స్కోరు అందించారు. ఇక 202 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన రాజస్థాన్ కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. భువనేశ్వర్ వేసిన మొదటి ఓవర్లో రెండో బంతిని ఎదుర్కొన్న బట్లర్ గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజు కూడా పరుగుల ఖాతా తెరవకుండానే క్లీన్బౌల్డ్ అయ్యాడు. శాంసన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పరాగ్, జైస్వాల్ ద్వయం హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించింది. ఈ ఇద్దరూ అవుట్ అయిన తర్వాత పరుగులు రాబట్టడంలో రాజస్థాన్ రాయల్స్ విఫలమైంది.