ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్సభ స్థానాలకు నామినేషన్ల పర్వం ప్రారంభం అయింది. నాల్గవ దశ ఎన్నికల్లో భాగంగా మే 13న రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది.
ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో తొలిరోజు నుంచే నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలుకానుంది. వీటిని ఏప్రిల్ 26 వరకు పరిశీలించి, 29 వరకు ఉపసంహరణకు సమయమిస్తారు. మే 13న పోలింగ్ కాగా.. జూన్ 4 ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఈసీవో ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
అసెంబ్లీ లేదా లోక్సభ స్థానం రిటర్నింగ్ ఆఫీసు కార్యాలయంలో ఉ.11 గంటల నుంచి మ.3 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవు రోజుల్లో స్వీకరించరు. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు వెయ్యొచ్చు. ఒక అభ్యర్థి ఏదైనా రెండు స్థానాల్లో మాత్రమే పోటీచేసే అవకాశ ముంది. ఎంపీ అభ్యర్థి అయితే ఫారం–2ఏ, ఎమ్మెల్యే అభ్యర్థయితే ఫారం–2బీ ఉపయోగించాల్సి ఉంటుంది. అభ్యర్థులు సువిధ యాప్ ద్వారా ఆన్లైన్లో నామినేషన్లు, అఫిడవిట్లను దాఖలు చేయవ చ్చు.పార్లమెంట్ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలో.. అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో ఎన్నికల కోడ్ను పాటిస్తూ నామినే షన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లు స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద సీసీ కెమేరాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ల దాఖలు ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయనున్నారు.