మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరోసారి నేపాలీ గ్యాంగ్ దోపిడీ కలకలం రేపింది. కౌకూర్లోని గోల్ఫ్ ఎన్క్లేవ్లో నివసిస్తున్న విశ్రాంత ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ , ఆయన భార్య డాక్టర్ విజయలక్ష్మీని బంధించి భారీ దోపిడీకి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
పోలీసుల వివరాల ప్రకారం, ఇంట్లో పని చేస్తున్న ఇద్దరు నేపాలీ పనిమనుషులు సహా మొత్తం ఎనిమిది మంది సభ్యులతో కూడిన ముఠా ఈ దోపిడీలో పాల్గొన్నట్లు గుర్తించారు. కేవలం 13 రోజుల క్రితమే పనిమనుషులుగా ఇంట్లో చేరిన నిందితులు, ముందుగా పథకం ప్రకారమే ఈ దోపిడీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
దోపిడీ సమయంలో వృద్ధ దంపతుల చేతులు, కాళ్లు కట్టేసి మత్తుమందు ఇచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం ఇంట్లో ఉన్న సుమారు 60 తులాల బంగారం, 20 కిలోల వెండి, నగదు దోచుకుని పరారయ్యారు. దోపిడీకి ముందు, తర్వాత ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు, హార్డ్డిస్క్లను ధ్వంసం చేసి ఆధారాలు చెరిపివేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.
ఘటన అనంతరం నిందితులు ఆటో బుక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయిన దృశ్యాలు సమీప ప్రాంతాల సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన మల్కాజిగిరి సీపీ సుమతి, ప్రత్యేక బృందాలతో కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలిపారు. నిందితులు ఇప్పటికే నేపాల్కు పారిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులు దాటే అవకాశాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇటీవలి కాలంలో నగర పరిసర ప్రాంతాల్లో నేపాలీ గ్యాంగ్ల పేరుతో జరుగుతున్న దోపిడీలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇంట్లో పనిమనుషులను నియమించుకునే ముందు పూర్తి వివరాలు, పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.


