స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రతీ ఏటా భారత్ నుంచి లక్షల సంఖ్యలో ముస్లింలు సౌదీ అరేబియాలోని పవిత్ర పుణ్యక్షేత్రం హజ్ యాత్రకు వెళ్తుంటారు.మన దేశం నుంచి ముస్లింలు విమాన మార్గంలో ఈ యాత్రకు వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా భారత్ నుంచి ఎక్కువ సంఖ్యలో ముస్లిం సోదరులు హజ్ యాత్రకి వెళ్తున్నారు. అయితే ఈ ఏడాది ఏపీ నుంచి చాలా మంది ముస్లింలు హజ్ యాత్రకి భారీగా తరలి వెళ్తున్నారు. వీరికోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టు నుండి ఉదయం ఏస్జీ 5007 విమానం బయలు దేరింది. 170 మంది ప్రయాణీకులతో నేరుగా జెడ్డాకు ఈ విమానం చేరుకుంటుంది. 41రోజుల పవిత్ర హజ్ యాత్రను ముగించుకుని జూలై 17న హజీలు తిరిగి ఏపీకి రానున్నారు. విజయవాడలోనే ఎంబారికేషన్ పాయింట్కు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసింది. అన్ని జిల్లాల నుంచి యాత్రికులను విజయవాడ తీసుకొచ్చేందుకు అధికారులు వాల్వో బస్సులు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్, బెంగళూరుతో పోలిస్తే విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే 1,813మందిపై దాదాపు రూ.83 వేల అదనపు భారం పడుతుంది. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హజీలకు రూ.14.51 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం బస, భోజనం, రవాణా సదుపాయాలు కల్పించడం పట్ల ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
7వ తేదీ, 14వ తేదీ వరకు విమానాలు బయలు దేరుతున్నాయని, హజ్ యాత్రకు వెళ్ళేవారికోసం అన్ని ఏర్పాట్లు చేశామని, హజ్ యాత్రికులకు లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. హజ్ యాత్రకు వెళ్లాలంటే ఏపీకి కోటా ఇస్తారని, డబ్బులు ఉన్నా హజ్ యాత్రకు వెళ్లలేరని డిప్యూటీ సీఎం తెలిపారు. మన రాష్ట్రం నుంచి 2300 మందికి హజ్ యాత్రకు వెళ్లే అదృష్టం దక్కిందని చెప్పారు. పవిత్ర మక్కాలో రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్ధన చేయాలని కోరుతున్నామని చెప్పారు.